వైఎస్ జగన్ ప్రత్యర్థితో షర్మిల భర్త భేటీ ... ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇదేనట..!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే వైఎస్ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆమె భర్త బ్రదర్ అనిల్ చెప్పినట్లుగా టిడిపి నేత బిటెక్ రవి తెలిపారు.
![TDP Leader Btech Ravi Meeting with YS Sharmila husband Brother Anil Kumar AKP TDP Leader Btech Ravi Meeting with YS Sharmila husband Brother Anil Kumar AKP](https://static-ai.asianetnews.com/images/01hk9s2nqk77x5rde8c465s546/download--90--png_363x203xt.jpg)
కడప : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ అధికార వైసిపికి వైఎస్ షర్మిల పెద్ద తలనొప్పిలా మారారు. సొంత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ షర్మిల. ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పులివెందులలో జగన్ ప్రత్యర్థి, టిడిపి నేత బిటెక్ రవితో భేటీ అయ్యారు. ఇలా షర్మిల, అనిల్ దంపతులు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కడప విమానాశ్రయంలో సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ తో టిడిపి సీనియర్ నేత బిటెక్ రవి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇద్దరు నేతలు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. అయితే వీరు అనుకోకుండా కలిసారా లేక ముందుగానే అనుకుని కలిసారో తెలియక అటు వైసిపి, ఇటు టిడిపి వర్గాల్లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో వీటికి ఫుల్ స్టాప్ పలికేందుకు స్వయంగా బిటెక్ రవి స్పందించారు.
అనిల్, షర్మిల దంపతులు తమ ఇద్దరు పిల్లలు, కాబోయే కోడలితో పాట విజయమ్మతో కలిసి వైఎస్సార్ సమాధిని సందర్శించారు. తన కొడుకు రాజారెడ్డి పెళ్లి పత్రికను తండ్రి సమాధి వద్ద వుంచి నివాళి అర్పించారు షర్మిల. ఈ క్రమంలో కడప నుండి విజయవాడకు కుటుంబం ప్రయాణిస్తున్న విమానంలో ఖాళీ లేకపోవడంతో బ్రదర్ అనిల్ మరో విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఇదే విమానంలో తాను కూడా ప్రయాణించాల్సి వుందని... ఇందుకోసం ఎదురుచూస్తుండగా అనిల్ తారసపడ్డాడని రవి తెలిపారు. విమానం కోసం ఎదురుచూస్తున్న తాము తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లు బిటెక్ రవి తెలిపారు.
Also Read కేసీఆర్ తో జగన్ కు ఆర్థిక లావాదేవీలు ... అందుకే తాజా భేటీ : చంద్రబాబు సంచలనం
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై షర్మిలకు అసలు అసక్తి లేదని... కానీ జగన్ పెట్టే ఇబ్బందులు భరించలేక ఆమె ఇక్కడికి వస్తున్నట్లు అనిల్ చెప్పారని బిటెక్ రవి వెల్లడించారు. సొంత సోదరుడు ముఖ్యమంత్రిగా వుండగా ఏపీ రాజకీయాల్లోకి రావద్దని షర్మిల అనుకున్నారంట... కానీ విధిలేని పరిస్థితుల్లో రావాల్సి వస్తోందని అనిల్ చెప్పారట. కాంగ్రెస్ లో చేరడం ఖాయమయ్యింది... కానీ షర్మిలకు ఏ పదవి ఇస్తారో అదిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారన్నారు.
ఇక కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుందన్న ప్రచారం గురించి అనిల్ వద్ద ప్రస్తావించినట్లు రవి తెలిపారు. కానీ ఇప్పటికయితే అటు కాంగ్రెస్, ఇటు షర్మిల ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారట. ఒకవేళ షర్మిలకు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు దక్కినా, కడప ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చినా రాజకీయ పరిస్థితులు ఎలావుంటాయి... ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు ఎలా వున్నాయి అన్న అంశాలపై బ్రదర్ అనిల్ తో చర్చించినట్లు బిటెక్ రవి తెలిపారు.