హాట్ న్యూస్: వైసిపిలో చేరనున్న ఏవి ?..టిడిపిలో టెన్షన్
- కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో శరవేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతోంది.
మంత్రి భూమా అఖిలప్రియ లక్ష్యంగా స్ధానిక నేత ఏవి సుబ్బారెడ్డి పెద్ద బాంబే పేల్చనున్నారా? 29వ తేదీన తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని ఏవి చేసిన ప్రకటనతో టిడిపిలో టెన్షన్ మొదలైంది. టిడిపిని వదిలేయటానికి వీలుగా వచ్చే ఎన్నికల్లో తనకు ఆళ్ళగడ్డ టిక్కెట్టు కావాలనే షరతు పెడుతున్నారు. మంత్రిని కాదని చంద్రబాబు ఏవికి టిక్కెట్టు ఇస్తారా? అందుకనే ఆ షరతు పెడుతున్నారా? అనే ప్రచారం జోరందుకుంది.
కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో శరవేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతోంది. పై రెండు నియోజకవర్గాల్లో ఏవి సుబ్బారెడ్డికి మంచి పట్టే ఉంది. ఏవి ఒకపుడు దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు.
అయితే, నాగిరెడ్డి హటాన్మరణం తర్వాత నాగిరెడ్డి కూతురు, మంత్రి భూమా అఖిలప్రియతో విభేదాలు మొదలైంది. దాంతో ఇద్దరి మధ్య ప్రస్తుత సంబంధాలు ఉప్పు-నిప్పులాగ ఉంది. ఏవికేమో పై రెండు నియోజకవర్గాల్లో బలమైన అనుచరగణం ఉంది. అదే సమయంలో మంత్రేమో స్వయంకృతం వల్ల అందరినీ దూరం చేసుకుంటోంది.
దానికితోడు ఎన్నికల తేదీ తోసుకొచ్చేస్తోంది. ఇటువంటి సమయంలో ఒకరిని దెబ్బ కొట్టేందుకు మరొకరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో మంత్రిని ఆళ్ళగడ్డలో గెలిపించటానికి ఏవి ఇష్టపడటం లేదని సమాచారం. అదే సమయంలో ఏవి ఆళ్ళగడ్డలో టిక్కెట్టుకు ట్రై చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ఇద్దరి మధ్య వివాదాలు తారస్ధాయికి చేరుకున్నాయి. అసలే టిడిపి పరిస్ధితి అంతంతమాత్రంగా ఉందని జరుగుతున్న ప్రచారానికి తోడు ఏవి కూడా అడ్డం తిరిగితే మంత్రి గెలుపు కష్టమే.
శుక్రవారం తన మద్దతుదారులతో సమావేశమైన ఏవి ఈనెల 29వ తేదీన తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని చెప్పారు. దాంతో పై రెండు నియోజకవర్గాల్లోని టిడిపి నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే, ఏవి వైసిపిలోకి జంప్ చేస్తారంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. అందుకనే టిడిపి నేతల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ అదే గనుక నిజమైతే రెండు నియోజకవర్గాల్లో టిడిపి గెలుపు కష్టమే.