అమలాపురంలో హింసాత్మక ఘటనపై స్పందించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. లా అండ్ ఆర్డర్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇళ్లు తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు ఒక్కటి కూడా లేవా అని ప్రశ్నించారు.
అమలాపురంలో హింసాత్మక ఘటనపై స్పందించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. లా అండ్ ఆర్డర్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇళ్లు తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు ఒక్కటి కూడా లేవా అని ప్రశ్నించారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉంటే.. అంతమంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. వారంతా వైసీపీ కార్యకర్తలేనని ఆరోపించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి జరిగిందంటే ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రాణప్రాయం ఉందనే కదా ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు.. అలా ఆలోచన చేసినప్పుడు ముందుగా ఎందుకు బందోబస్తు పెట్టలేదని అడిగారు. మూడేళ్లుగా రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం చేస్తూనే ఉందని ఆరోపించారు. అమలాపురంలో జరిగింది ప్రభుత్వం స్పాన్సర్ చేసిన విధ్వంసం అని మండిపడ్డారు.
సీఎం పదవి కోసం కోడి కత్తి నాటకం ఆడింది సీఎం జగన్ కాదా అని ప్రశ్నించారు. ఎస్సీ వ్యక్తిని ఇంట్లో నుంచి తీసుకెళ్లి వైసీపీ ఎమ్మెల్సీ చంపేశారని.. హత్య ఘటన నుంచి దారి మళ్లించేందుకే విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చడం సీఎం జగన్కు బాగా అలవాటని అన్నారు. కోనసీమను విధ్వంసం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.
అమలాపురంలో 5 రోజులుగా ఆందోళనలు జరుగుతున్న పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆందోళనలను పట్టించుకోలేదంటే ప్రభుత్వ స్పాన్సర్డ్ కార్యక్రమం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడికి ముందు ఆయన కుటుంబ సభ్యులను తరలించారని.. ముందే తరలించారంటే దాడి జరుగుతుందని పోలీసులకు ముందే తెలుసా అని ప్రశ్నించారు. పోలీసులకు విషయం తెలిసి కూడా బందోబస్తు పెట్టలేదంటే ఏమనాలని ప్రశ్నించారు. తునిలో రైళ్లు తగులబెట్టడం వెనుక వైసీపీ హస్తం లేదా ప్రశ్నించారు.
విధ్వంసంలో కీలకంగా వ్యవహరించిన అన్యం సాయి వైసీపీ నేత అని అన్నారు. వాస్తవాలు స్పష్టంగా ఉంటే హోం మంత్రి టీడీపీపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. అన్నం సాయి టీడీపీ కార్యకర్త అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు కౌగిలించుకుంటారని నిలదీశారు. ఈ సందర్భంగా సజ్జల, విశ్వరూప్తో అన్నం సాయి ఉన్న ఫొటోలను అచ్చెన్నాయుడు విడుదల చేశారు.
