ఏపీ శాసనమండలిలో  ప్రభుత్వ వ్యూహానికి కౌంటర్‌గా టీడీపీ ముందుకు వెళ్తోంది. 


అమరావతి: ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ వ్యూహానికి కౌంటర్‌గా టీడీపీ ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ బిల్లు కంటే ముందే టీడీపీ సభ్యులు వ్యూహాత్మకంగా రూల్ నెంబర్ 71 కింద నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసు కింద చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వంపై టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రశ్నలు కురిపించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also read:ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ

మంగళవారం నాడు శాసనమండలిలో ప్రభుత్వం పాలనా వికేంంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే 71 కింద నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసు కింద చర్చలు చేపట్టాలని టీడీపీ పట్టుబట్టింది.

శాసనమండలి గురించి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడిన వ్యాఖ్యల గురించి టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. శాసనమండలిని కించపర్చేలా మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

అంతేకాదు టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలకు అధికార పార్టీకి చెందిన సభ్యుల నుండి ఎందుకు ఫోన్లు వచ్చాయో చెప్పాలని యనమల రామకృష్ణుడు కోరారు. 

ప్రభుత్వం ఏదైనా విధానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో 71 రూల్ కింద మండలి తిప్పిపంపే అధికారం ఉందని టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. అయితే టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానాన్ని అడ్డుకొనే హక్కు లేదని మంత్రి చెప్పారు.

ఇదిలా ఉంటే టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలకు ఎవరు ఫోన్లు చేశారో నిరూపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ యనమల రామకృష్ణుడుకు సవాల్ విసిరారు.

వైసీపీకి చెందిన నేతలు లేదా ప్రజా ప్రతినిధులు టీడీపీ ఎమ్మెల్సీలకు పోన్ చేసినట్టుగా నిరూపించాలని యనమల రామకృష్ణుడును మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఈ సమయంలో ఇద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకొంది.

ఏపీ శాసనమండలికి శమంతకమణి, డొక్కా మాణిక్యవరప్రసాద్, నామినేటేడ్ సభ్యురాలు రత్నాబాయి మంగళవారం నాడు గైర్హాజరయ్యారు. శమంతకమణి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు టీడీపీకి చెందినవారు.ఇక బీజేపీకి చెందిన మాధవ్ తొలుత సభకు హాజరు కాలేదు. ఆ తర్వాత మాధవ్ సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రత్నాబాయి సమావేశానికి హాజరు కాలేదు.