లోకేష్ కోసం చంద్రబాబు కుప్పం త్యాగం..?
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ... ఆ అధికారాన్ని కంటిన్యూ చేయలేకపోయింది.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ... ఆ అధికారాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. ఈ సారి ప్రజలు జగన్ కి అవకాశం కల్పించారు. అయితే... ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చంద్రబాబు ధీమాగా ఉన్నప్పటీ ఫలితం మాత్రం మరోలా వచ్చింది. ఈ ఎన్నికల్లో ఒకవేళ విజయం సాధించి ఉంటే...తనయుడు లోకేష్ కి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించేవారనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో... ఐదేళ్లపాటు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కూడా లేదు. ఈ క్రమంలో చంద్రబాబు... తన కుమారుడు లోకేష్ కూడా తన నియోజకవర్గాన్ని ఇచ్చేద్దామనుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.
కాగా...దీనిపై టీడీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబునాయుడు జూన్ నెల 2వ వారంలో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు రాజీనామా చేస్తారని, లోకేశ్ కుప్పం వస్తారని వినిపిస్తున్న వదంతులను ఖండించారు. అవి పూర్తిగా సత్యదూరమన్నారు.
ఆయన ఇక పూర్తిగా కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేస్తారన్నారు. వచ్చేనెల పర్యటనలో చంద్రబాబు పంచాయతీల వారీగా పర్యటించి, ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతారన్నారు. అదే సమయంలో ప్రజా సమస్యలు వినడమేకాకుండా ఆయా పంచాయతీల వారీగా పార్టీ స్థితిగతులపై ఇప్పటికే తనకున్న సమాచారం మేరకు ఆరాతీసి, ఎక్కడ ఎటువంటి మార్పుచేర్పులు చేయాలో ఒక అవగాహనకు వస్తారన్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని విడిచిపెట్టే పరిస్థితే లేదని మనోహర్ స్పష్టం చేశారు.