ఫస్ట్ కేసీఆర్ నెక్స్ట్ జగన్, బీజేపీ ప్లాన్ లీక్ చేసిన రాయపాటి: బాబుపై సంచలన వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాల్లో జాప్యం ఎక్కువగా ఉంటుందని అందువల్లే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యిందని చెప్పుకొచ్చారు.
తిరుపతి: దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని వ్యూహాత్మకంగా అడుగుల వేస్తున్నట్లు తెలిపారు.
తిరుమలలో మీడియాతో మాట్లాడిన రాయపాటి సాంబశిరావు తెలుగు రాష్ట్రాల్లో పట్టుపెంచుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ముందు కేసీఆర్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను సాగనంపేలా వ్యూహం సిద్ధం చేస్తోందంటూ బీజేపీ ప్లాన్ ను బట్టబయలు చేశారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అన్నీ తెలుసునని అయినా తెలియనట్లు ఉంటారంటూ విమర్శించారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాల్లో జాప్యం ఎక్కువగా ఉంటుందని అందువల్లే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యిందని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యేలు చేసిన అవినీతే ఎంపీల ఓటమికి కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై రాయపాటి సాంబశివరావు ప్రశంసలు కురిపించారు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు చాలా బాగున్నాయి అంటూ కితాబిచ్చారు.
నిన్నటి వరకు రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ వీడి బీజేపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇలాంటి పరిణామాల్లో బీజేపీపై విమర్శలు చేయడం, సొంతపార్టీ అధినేతపై కన్నెర్ర జేయడం, జగన్ ను పొగడ్తలతో ముంచెత్తడం చూస్తుంటే రాయపాటి వైసీపీలో చేరతారా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
రాయపాటి యూటర్న్... బీజేపీకాదు, వైసీపీలోకి..?