ఆ పంచాయితీల ఫలితాలు తారుమారు...వైసిపి కుట్రలు: ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ
అధికార వైసిపి నేతలు అధికారులను బెదిరించి ప్రజాభిప్రాయాన్ని కాలరాస్తున్నారని... రిటర్నింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాలను తారుమారు చేస్తున్నారని తన లేఖ ద్వారా ఎస్ఈసీ దృష్టి తీసుకెళ్లారు చంద్రబాబు.
గుంటూరు: టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన చోట ఫలితాలు తారుమారు చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందంటూ ఎస్ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. అధికార వైసిపి నేతలు అధికారులను బెదిరించి ప్రజాభిప్రాయాన్ని కాలరాస్తున్నారని... రిటర్నింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాలను తారుమారు చేస్తున్నారని తన లేఖ ద్వారా ఎస్ఈసీ దృష్టి తీసుకెళ్లారు చంద్రబాబు.
''కడప జిల్లా రాజుపాలెం మండలం ఎరువుపాలెం, పోరుమామిళ్లలో రాజాసాహెబ్ పేట, కర్నూలులో బండిఆత్మకూరులో జీసీపాలెం, నంద్యాలలో అయ్యలూరు, గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలం, పిలపర్తి, నెల్లూరు జిల్లా కావలిలోని చిలంచెర్ల, విశాఖపట్నం జిల్లాలోని చిడికాడలో దిబ్బపాలెంలో టీడీపీ గెలిచినా వైసీపీ అడ్డుపడుతోంది. కర్నూలు జిల్లా మహానందిలోని బుక్కాపురం, నంద్యాల రూరల్ బిల్లాలపురంలో వెంటనే రీ కౌంటింగ్ జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి'' అని కోరారు.
''కర్నూలు జిల్లా రుద్రవరంలో శ్రీరంగాపురం, ఆల్లగడ్డలో బాచుపల్లి, చాగలమర్రులో చింతలచెరువు, చిత్తూరులో కారవేటినగరంలో ఆర్కేవీవీ పేట, ప్రకాశం జిల్లా ఇంకొల్లులో సూదివారిపాలెం, తూ.గో. జిల్లా పిఠాపురంలో పి.దొంతమూరు గ్రామాల్లో ఎన్నికల ఫలితాలు నిలిపేశారు. కర్నూలు జిల్లాలో బాచుపల్లి గ్రామ పంచాయతీలో టీడీపీ సానుభూతిపరులపై దాడికి పాల్పడ్డ సీఐ రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి'' అని చంద్రబాబు ఎస్ఈసీని కోరారు.
read more షర్మిల పెట్టిన ముహూర్తంలోనే... వైసిపి పతనానికి నాంది: దేవినేని ఉమ వ్యాఖ్యలు (వీడియో)
స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జనంలో ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని జగన్రెడ్డి రాజ్యాంగ వ్యవస్థలపై దాడికి తెగబడ్డారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. న్యాయస్థానాల చొరవతో స్థానిక ఎన్నికలు జరిగుతున్నాయని... అయితే .ఇక్కడా అధికార యంత్రాంగం, పోలీసుల్ని వాడుకుని వైసీపీ వాళ్లు హత్యలు చేస్తున్నారు, కిడ్నాప్లకు పాల్పడుతున్నారు, నామినేషన్ పత్రాలు చించేశారు, ఆస్తులు తగులబెట్టారు, ప్రలోభాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారని లోకేష్ మండిపడ్డారు.
''అధికార పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా ఎదురొడ్డి నిలిచి గెలిచిన తెలుగుదేశం యోధులకు, కార్యకర్తలకు శిరసువంచి నమస్కరిస్తున్నాను. గాలి హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ఫేక్ పార్టీకి ఒక్క చాన్స్ చివరి చాన్స్ అని ప్రజలు స్థానిక ఎన్నికల ద్వారా తీర్పునిచ్చారు. వైఎస్ జగన్రెడ్డి ఇంట్లో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి..జనం గుండెల్లోంచి పుట్టిన తెలుగుదేశం పార్టీతో పోలికా?'' అని లోకేష్ విమర్శించారు.