వైసీపీ నేతలకు లేని ఆంక్షలు రైతులకు ఎందుకు? చరిత్ర హీనులుగా మిగలొద్దు: చంద్రబాబు ఫైర్
అమరావతి కోసం రైతులు చేపట్టిన పాదయాత్రకు వైసీపీ కావాలనే అవరోధాలు కల్పిస్తున్నదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్పకు నాలుగేళ్లు నిండిన సందర్భంగా వైసీపీ శ్రేణులు పాదయాత్రలు, బహిరంగ సభలు పెట్టాయని, అప్పుడు లేని కరోనా ఆంక్షలు రైతుల పాదయాత్రపై ఎందుకు అని నిలదీశారు.
అమరావతి: వైసీపీ నేతలపై TDP అధినేత Chandrababu Naidu ఫైర్ అయ్యారు. Amaravati రైతుల పాదయాత్రపై కావాలనే YCP ఉక్కుపాదం మోపుతున్నదని ఆరోపించారు. రైతుల పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు వస్తున్నదని, ఇది చూసి వైసీపీ ఓర్వలేకపోతున్నదని తెలిపారు. అందుకే Farmers పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు సృష్టిస్తున్నదని వివరించారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ రైతులపై ఉక్కుపాదం మోపుతున్నదని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. Andhra Pradesh High Court అనుమతి ఇచ్చిన పాదయాత్రను అడ్డుకోవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోర్టు అనుమతులను కాదని పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయడం హేయమని వివరించారు. పాదయాత్రను కోవిడ్ ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు నిండాయని నిన్న రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహించారని చంద్రబాబు గుర్తు చేశారు. పాదయాత్రలు చేశారని, బహిరంగ సభలు పెట్టారని వివరించారు. వారికి లేని కరోనా వైరస్ కట్టడి నిబంధనలు రైతుల పాదయాత్రకు ఎలా వర్తిస్తాయని నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదని, అందుకే ప్రజలను పోలీసులతో అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల మంది భవిష్యత్ను అంధకారంలోకి నెట్టారని, క్షమించరాని తప్పు చేశారని తెలిపారు. తాజాగా, ఐదు కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకుని చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని సూచనలు చేశారు.
Also Read: వైసీపీ కార్యకర్తలకు రెడ్ కార్పెట్ .. రైతుల పాదయాత్రకేమో అడ్డమా: పోలీసులపై లోకేశ్ మండిపాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేపట్టారు. రాజధాని కోసం చేపట్టే మహాపాదయాత్రకు అమరావతి పరిరక్షణ సమితి తొలుత పోలీసు అనుమతి కోరింది. కానీ, పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించి రైతుల మహాపాదయాత్రకు అనుమతులు ఇవ్వాలని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టి నాలుగేళ్లు గడిచిన సందర్భంగా నిన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు వేడుకలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేశారు. పాదయాత్రలు చేపట్టారు.
Also Read: వైఎస్ జగన్ సంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. రాష్ట్రమంతా వేడుకలు
ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర పూర్తి చేసుకుని Four Years పూర్తి చేసుకున్న సందర్భంగా నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఓం శక్తి సర్కిల్ దగ్గర వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత పడుతున్న కష్టాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు అని ఆరోపించారు. కానీ, వైఎస్ జగన్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంకల్పించి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని వివరించారు. మూడువులకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని, అధికారంలోకి వచ్చాక అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని, ఇచ్చిన హామీలకు కట్టుబడ్డ సీఎంగా జగన్ చరిత్ర సృష్టించారు. ఒక సీఎంగా ఇంతలా తపించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని అన్నారు. అందుకే ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం వైస్ జగన్దేనని చెప్పారు.