ఇసుకాసురుడు @ 40వేల కోట్ల దోపిడీ.. జగన్కు పది ప్రశ్నలు, 48 గంటల్లో సమాధానం చెప్పాలి : చంద్రబాబు
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నాలుగున్నరేళ్లలో 40 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలతో 40 వేల కోట్లు దోచుకున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. జగన్ 6 అంశాలతో రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు వచ్చారని ఆరోపించారు. ఇసుకాసురుడు @ 40వేల కోట్ల దోపిడీ అంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇసుకపై 40 లక్షల మంది నిర్మాణ రంగం కార్మికులు ఆధారపడ్డారని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక అందించామని.. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 48 మంది బలయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలవారీగా వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి దోచుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. ఎన్జీటీ ఆదేశాలు కూడా ఉల్లంఘించారని..నాలుగున్నరేళ్లలో 40 కోట్ల టన్నుల అక్రమ తవ్వకాలతో 40 వేల కోట్లు దోచుకున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని.. పోలీసులూ ఖబడ్దార్, తప్పు చేసే అధికారులను గుర్తు పెట్టుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. నాలుగున్నరేళ్లలో ఇసుక ఎంత తవ్వారు..ప్రభుత్వ ఆదాయం ఎంతో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ALso Read: అవనిగడ్డలో వైసీపీ, టీడీపీ మధ్య ఫ్లెక్సీల వార్.. రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందన్న బుద్దప్రసాద్
నాలుగున్నరేళ్లలో జీఎస్టీ ఎంత కట్టారు.. ఇసుక తవ్వకాలపై సమాధానం చెప్పాలంటూ 10 ప్రశ్నలు వేశారు టీడీపీ చీఫ్. ఇందుకు 48 గంటల డెడ్లైన్ విధించారు. గతంలో చిన్న విషయంలో ఎవరైనా తప్పు పడితే సీఎంలు రాజీనామా చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు, ప్రైవేట్ మాఫియా తో ఇష్టానుసారంగా ఇసుక తవ్వుతున్నారని ఆయన ఆరోపించారు. దొంగల్ని పట్టుకుని ప్రజా కోర్టులో శిక్ష వేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.