అవనిగడ్డలో వైసీపీ, టీడీపీ మధ్య ఫ్లెక్సీల వార్.. రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందన్న బుద్దప్రసాద్
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీల వార్ నెలకొంది. అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ దగ్గర టీడీపీ, వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు వెలిశాయి.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీల వార్ నెలకొంది. అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ దగ్గర టీడీపీ, వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. టీడీపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ రైతు సమస్యలపై సత్యాగ్రహ దీక్షకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇందుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే వైసీపీ శ్రేణులు కావాలనే రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఫ్లెక్సీలు వేసి రెచ్చగొట్టాలని కుట్ర జరుగుతోందని మండలి బుద్దప్రసాద్ ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు, రైతులు సంయమనంతో వ్యవహరించి సత్యాగ్రహ కార్యక్రమం విజయవంతం చేయడం పైనే దృష్టి పెట్టాలని కోరారు.