ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లును తిరస్కరించండి : గవర్నర్ను కోరిన చంద్రబాబు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి గురువారం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసింది. బిల్లును తిరస్కరించాలని గవర్నర్ను కోరినట్లు చంద్రబాబు తెలిపారు.
సీఎం అనాగరికంగా పనికిమాలిన చర్యలు చేపట్టారని ఫైరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి గురువారం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో చీకటి చట్టాన్ని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి గుండెల్లో ఉన్న వ్యక్తి ఎన్ఠీఆర్ అన్న ఆయన.. 1986లో యూనివర్సిటీ ప్రారంభిస్తే 1998లో తాను ఎన్ఠీఆర్ పెరు పెట్టినట్లు గుర్తుచేశారు. వైద్యరంగంలో పెను మార్పులు తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు ప్రశంసించారు.
13 ప్రైవేట్, 5 గవర్నమెంట్ కాలేజీలు టీడీపీ హయాంలో వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పే సీఎం ను జీవితంలో చూడలేదని.. తన హయాంలో మెడికల్ కాలేజీలు వచ్చాయో లేదో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారంటూ ఆయన చురకలు వేశారు. అమరావతిలో మెడికల్ కాలేజీ వస్తే నీళ్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. NTR పేరు తీసేయడానికి సీఎంకు ఎంత ధైర్యం అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్తో రాజశేఖర్ రెడ్డిని పోల్చడానికి సిగ్గు ఉండాలని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఛాన్సులర్గా ఉన్న గవర్నర్ కు కూడా సమాచారం అందించలేదని.. బిల్లును తిరస్కరించాలని గవర్నర్ను కోరినట్లు ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read:అది వాళ్లకు ఇచ్చే గౌరవం.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై షర్మిల సంచలన కామెంట్స్..
కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ బిల్లును ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని ప్రవేశ పెట్టారు. వైద్యరంగంలో సంస్కరణలకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టినందునే ఆయన పేరును ఈ హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని తాము భావించినట్టుగా మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్కార్ కంటే తమ ప్రభుత్వమే గొప్పగా గౌరవించిందన్నారు. ఎన్టీఆర్ ను కించపర్చేలా గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని మంత్రి రజనీ ఈ సందర్భంగా చెప్పారు.