Asianet News TeluguAsianet News Telugu

జగన్ రెడ్డిది స్పెషల్ క్యారెక్టర్...ఆయనకు విలన్ అనే పేరు చిన్నది.. చంద్రబాబు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan)  పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రతిపక్షాలను, ఇబ్బందులకు గురిచేస్తూ ఉగ్రవాద పాలన సాగిస్తున్నారని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ (telugu desam party) కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా 36 గంటల పాటు ఆయన దీక్ష చేశారు.

TDP Chief Chandrababu Naidu Fires on CM YS jagan At his 36 hours deeksha
Author
Amaravati, First Published Oct 23, 2021, 1:45 PM IST

రాష్ర్టంలో వైసీపీ అరాచకం పరాకాష్టకు చేరిందని, ప్రజల కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రతిపక్షాలను, ఇబ్బందులకు గురిచేస్తూ ఉగ్రవాద పాలన సాగిస్తున్నారని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ (telugu desam party) కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా 36 గంటల పాటు ఆయన దీక్ష చేశారు. ఈ దీక్ష ముగింపు సందర్బంగా చంద్రబాబు నాయుడు  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డ్రగ్స్ కథ తేల్చేవరకు టీడీపీ  రాజీలేని  పోరాటం  చేస్తుందన్నారు. పోలీసుల అండతోనే  రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా సాగుతుందని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా  టీడీపీ శ్రేణుల్ని ఆర్థికంగా, మానసికంగా  వేధించినా భరించామని.. డ్రగ్స్‌తో యువత భవిష్యత్ పాడు చేస్తుంటే  చూస్తు ఊరుకోమని అన్నారు. 

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మించుకున్న 70 లక్షలమంది కార్యకర్తలకు దేవాలయమైన టీడీపీ కార్యాలయంపై దాడి చేశారంటే.. ఉగ్రవాదం కాక మరేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇంటికి దగ్గరలో, డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఈ దాడి జరిగిందంటే వీళ్ల పరాకాష్టకు ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏముంటుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ  అడ్డుకుని ఉంటే ఈ దాడి జరిగేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆలోచించాలి అని అన్నారు. ఏపీలో గంజాయి, హెరాయిన్, మత్తు పదార్ధాలు విచ్చలవిడి అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఏపీలో చట్టబద్దమైన  పాలన పునరుద్దరించడానిక రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలకు, ప్రతిపక్ష పార్టీ నాయకులకు వెంటనే సెంట్రల్ పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు.

‘25 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. గుజరాత్ ముంద్రా పోర్టులో విజయవాడ చిరునామాతో రూ. 72  వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది. దీనిపై జాతీయ  మీడియాలో సైతం వార్తలొస్తే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అప్రమత్తమవ్వకుండా  పోలీసులు దీంతో ఏపీకి ఎలాంటి సంబందం లేదని చెప్పటం బాధ్యతరాహిత్యం కాదా..?. మన పిల్లలు గంజాయి, హెరాయిన్ వంటి మత్తు పధార్ఢాలకు అలవాటు పడితే వారి భవిష్యత్ ఏంటని, ప్రభుత్వం రాష్ట్రంలో మత్తు పధార్ధాల్ని అరికట్టాలని ప్రజలే కోరుకుంటున్నారు. నేను చేస్తున్న ఈ దీక్ష ఎందుకు చేస్తున్నానో ప్రజలందరు తెలుసుకుని మద్దుతు తెలిపారు. కానీ ఈ గుడ్డి ముఖ్యమంత్రికి మాత్రం కనడపటం లేదు’అని  అన్నారు.

మద్యపాన  నిషేదం అని చెప్పిన  వైఎస్ జగన్  మాట తప్పారని విమర్శించారు. మద్యం వ్యాపరం చేస్తూ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని  బ్రాండ్లు  ఏపీలోనే ఎందుకు  అమ్ముతున్నారని  ప్రశ్నించారు. రూ.   60 ఉన్న మద్యం బాటిల్  ధరను ‎రూ. 200 కు పెంచారని.. మద్యం రేట్లు పెంచితే త్రాగడం మానేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కల్తీ మద్యం త్రాగి ప్రజలు చనిపోతే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడవా అని నిలదీశారు. ఇప్పుడు గంజాయి, హెరాయిన్‌తో యువత, విధ్యార్దుల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని..  రాష్ట్ర యువత భవిష్యత్ కోసం మేం ప్రశ్నిస్తే మాపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

‘మనం చెప్పిన విషయమే హైదరాబాద్ సీపీ ప్రెస్ మీట్ పెట్టి ఏపీలోని విశాఖ, సీలేరు, నర్పీపట్నం నుంచి గంజాయి తెలంగాణకు అక్రమ రవాణా జరుగుతోందని చెప్పారు. తెలంగాణను డ్రగ్ ప్రీ స్టేట్ మారుస్తానని అక్కడి సీఎం అంటున్నారు.. కానీ జగన్ మాత్రం దాని మీద ఏ నాడైనా సమీక్ష చేశారా?   దానిపై సమీక్ష చేసే ‎ టైం లేదు గానీ , ఎన్టీఆర్ భవన్ పై దాడి  ఎలా చేయాలో సమీక్ష చేస్తారు. టీడీపీ నేతలు డ్రగ్స్ మాఫియా‎పై మాట్లాడితే ఆదారాలివ్వండని పోలీసులు నోటీసులిస్తున్నారు. మేం ఆధారాలు ఇస్తే పోలీసులు ఉంది ఎందుకు?  మీ‎ చొక్కాలు  తీసేయండి విచారణ మేమే చేసి మీకు ఆధారాలు ఇస్తాం,

సమైక్యాంధ్ర రాష్ర్టంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను. రాష్ట్రంలో ఉగ్రవాదం, ముఠా కక్ష్యలు, మతతత్వం లేకుండా ఉండేందుకు కృషి చేశాను. అందుకే నాపై 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే వెంకటేశ్వర స్వామి కాపాడారు. బాంబులకు భయపడని నేను వీళ్లకు భయపడతానా?.  పట్టాభి  సీఎం తల్లిని దూషించారని అంటున్నారు, నేను రాజకీయాల్లోకి వచ్చినపుడు జగన్ నోట్లో వేళ్లేసుకుని ఆటలాడుకుండి ఉంటారు.  నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేనెప్పుడైనా సంయమనం కోల్పోయి మాట్లాడానా? వీళ్ల తప్పులు ఎండగడితే బూతుల మంత్రి, వైసీపీ ఎమ్మెల్యేలు నన్ను ఇష్టమెచ్చినట్టు బూతులు తిడుతున్నారు. అమరావతి పర్యటనలో నా బస్సుపై చెప్పు వేస్తే ఎవరో భాధితులు ఆవేదనతో విసిరి ఉంటారని సాక్షాత్యు డీజీపీ మాట్లాడారంటే ఏం అనాలి?  ప్రజావేదిక కూల్చివేతతో జగన్ రెడ్డి విద్వంసం ప్రారంభమైంది’అని చంద్రబాబు  అన్నారు.

 
ఆత్మకూరులో దళితులు గ్రామంలోకి రానివ్వకుండా ఉంటే చలో పల్నాడుకు పిలుపినిస్తే నా ఇంటి గేట్లు తాళ్లు కట్టి నన్ను బయటకి రానివ్వలేదని అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నన్ను అడ్డుకుని వెనక్కి పంపారని  తెలిపారు.  ఈ ఘటనలో కోర్టు డీజీపికి రాజ్యాంగంపై ఏమైనా అవగాహన ఉందా అంటూ అక్షింతలు వేసిందని చెప్పారు.. ఎన్ని సార్టు కోర్టులు చివాట్టు పెట్టినా వీళ్ల తీరు మార్చుకోవటం లేదని  అన్నారు. టీడీపీ ఆపీసుపై దాడి ఘటన గురించి పోన్ చేస్తే కేంద్ర హోంమంత్రి, గవర్నర్ పోన్ తీసి మాట్లాడారని.. ‎డీజీపీ కనీసం స్పందించకపోగా పైగా  దాడి చేసిన వాళ్లను పోలీసులే సాదరంగా పంపించారని అన్నారు. ఆపీసుపై దాడి జరిగినా ఇన్ని గంటలు గడిచినా ఇంతవరకు కనీసం కేసు పెట్టలేదని ఒక్కరినీ కూడా  అరెస్టు చేయలేదని మండిపడ్డారు. 

‘దాడికి వచ్చిన వ్యక్తి  ఆపీసులో చిక్కితే ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించాం. కానీ ఆ సమయంలో అక్కడ లేని లోకేశ్ , బ్రహ్మం, ఇతర నేతలపై 307 కేసులు పెట్టటారంటే డీజీపిని ఏమనాలి?. తప్పుడు కేసులు పెట్టి  కోర్టుకు సైతం పోలీసులు తప్పుడు రికార్దులు ఇస్తున్నారు. పట్టాభి ఇంటిపై  దాడి చేస్తే ఇంట్లో ఉన్న 8 సంవత్సరాలు పాప  భయపడి సైకలాజికల్ గా కోమాలోకి వెళ్లే పరిస్థితి. ‎ దాడి చేసిన వారిపై కేసులు లేవు గానీ  పట్టాభి ఏదో తిట్టిడాడని  తిట్టినదాటిని కొత్తం అర్దం చెబుతున్నారు. తన తల్లిని తిట్టారని జగన్ అంటున్నారు. పాపం  జగన్ కి తన తల్లిపై ఎంత ప్రేమో.‎ జగన్ రాజకీయ లబ్ది కొసం ఉపయోగించుకున్నారు. జగనన్న బాణం తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతోంది. సొంత చెల్లికి న్యాయం లేని జగన్ నాకు నీతులు చెబుతారా’అని ప్రశ్నించారు.

‘రాష్ట్రాన్ని కాపాడేందుకు మేం పోరాటం చేస్తున్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయం మాదే. టీడీపీ కార్యకర్తల చరిత్ర జగన్ కి తెలియదు. ఎన్ని అడ్డకుంలు వచ్చినా పోరాడి విజయం సాధిస్తాం తప్ప వెనకడుగు వేయం. 1983 లో ఇంధిరాగాంధీని ఎదిరించి  9 నెలల్లోనే  ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రిని చేశారు. ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డిని నేను చంపానని చెప్పిన  జగన్ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వెనక్క తీసుకున్నారు..?.  రెండున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను పెట్టిన ఇబ్బందులు గురించి చెబుతుంటే కళ్ల వెంట నీళ్లొస్తున్నాయి.  రెండున్నరేళ్లలో ఆర్టికంగా ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి.  గతంలో రాజారెడ్డి ఇలానే ఆర్దిక నష్టం చేసేవారు. 

జగన్ నియంత పాలన సాగిస్తున్నారు. ఆయన సైకో మాత్రమే కాదు..ఆయనది ఒక స్పెషల్ క్యారెక్టర్.  నాతో రాజశేఖర్ రెడ్డి  పైట్ చేసే వాడు,..అసెంబ్లీలో గట్టిగా మాట్లాడితే గమ్మున కూర్చుండేవారు. పరిటాల రవి విషయంలో అసెంబ్లీలో నిలదీసి భయపెడే పరిస్థితి తెచ్చాను. ఇంధిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై పోరాటం చేశాం, ఎంతోమంది ముఖ్యమంత్రలుపై పోరాడాం కానీ వాళ్లలో ఎవరూ జగన్ లా నియంతృత్వంగా వ్యవహరించలేదు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, జేసీ ప్రభాకర్ రెడ్డి, బి.టెక్ రవి,  దూళి పాళ్ల నరేంద్రపై అమూల్ డెయిరీకి తాకట్టు పెట్టడానికి లాలూచీ పడి కేసులు పెట్టారు. చింతమనేనిపై ఎన్నో కేసులు పెట్టారు, చివరకు నామీద కూడా కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులకు ఒకటే చెబుతున్నాం. రేపు అనేది ఒకటే ఉంది. గతంలో  కొంతమంది ఆపీసర్టు, పెట్టుబడి దారులు అడ్డదారి తొక్కి జైలుకెలారు. విజయవాడలోని అడ్రస్ లేని ఆకురౌడీలు తప్పుడు పనులు చేస్తూ సీసీ కెమెరాల్లో అడ్డంగా బుక్కయ్యారు. మిమ్మల్ని వదులుతానా? అప్పుడు ఈ డీజీపీ, ఈ జగన్ వచ్చి కాపాడుతారా?  పోలీసుల అండతోనే మాఫియాలు నేరాలు, ఘోరాలు చేస్తున్నారు.

జగన్ రెడ్డి అమరావతిని నిలిపివేసి రాష్ట్రాన్నినాశనం చేశారు. నాడు కోకాపేట భూములు ఎకరా 20 వేలు నేడు వేలం వేస్తే రూ. 60 కోట్లు. నేను పిలుపునిస్తే రైతులు రాజధాని కోసం 35 వేల ఎకరాలు ఇచ్చారు. నేను ఇప్పటికి వేరే ఇంట్లో ఉంటున్నా. భారతదేశ రాజకీయాల్లో జగన్ రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టం ముందూ అందరూ తల వంచాల్సిందే. నాడు పాదయాత్రలో జగన్ రెడ్డి ముద్దులు పెట్టి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. హైదరాబాద్ లో నేను ప్రారంభించిన అన్ని అభివృద్ది పనులు రాజశేఖర్ రెడ్డి కొనసాగించాడు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏపీలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. అమరావతిలో ప్రపంచ స్థాయి మహానగరం నిర్మించాలని కలలు కన్నా. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే జైలుకు వెళ్లాల్సివస్తుందని ఏనాడు తప్పు చేయలేదు. రాజశేఖర్ రెడ్డి నాపై 25 కేసులు పెట్టాడు. కానీ ఏ కేసులో కూడా నిరూపించలేకపోయాడు.

హైదరాబాద్ అభివృద్ధి చూస్తే నాకు ఒక తృప్తి. అప్పట్లోనే 8 వరుసల రోడ్లు వేశాం. అది నా విజన్. ప్రతి సోమవారం పోలవరం గా చేసుకుని ప్రాజెక్టు కోసం పనిచేశా. జగన్ రెడ్డికి ఇరిగేషన్‌లో ఓనమాలు తెలియదు. అందుకే కేసీఆర్‌తో మంతనాలు జరిపాడు. సీపీఎస్‌ను వారంలో తగ్గిస్తానని, కరెంటు బిల్లులు తగ్గించేస్తానని తప్పుడు వాగ్దానాలు చేశాడు. అందుకే అనుభవం లేని వాడు రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తాడో జగన్ రెడ్డే ఉదాహరణ. అన్ని ప్రాజెక్టులు జగన్ రెడ్డి చేతగానితనంతో నాశనం చేశాడు. లేనిదాన్ని కావాలని సృష్టించుకుని తల్లిని చెల్లిని రాజకీయాల్లోకి తెచ్చి రోడ్లపై తిప్పాడు. కేసులు పెట్టి మానసికంగా వేధిస్తే మాకు రావా బీపీలు?. తప్పు చేసిన వైసీపీ నాయకులను పట్టుకోవడానికి పోలీసులు భయపడుతున్నారు. తెలుగుదేశం హయాంలో అన్ని ముఠాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేశాం. సొంతపార్టీ వారిపైనా కఠిక చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం చట్టబద్ధంగా పరిపాలించాం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం పై సి.బి.ఐ విచారణ చేయించాలి. ఏపీలో ప్రజాస్వామ్య వ్యవస్థలను, చట్టబద్ధ పాలనను పునరుద్ధరించేందుకు ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన) విధించాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలకు, ప్రతిపక్ష పార్టీ నాయకులకు వెంటనే సెంట్రల్ పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకునే పోరాటంలో పాల్గొనే మీ అందరినీ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను’అని  చంద్రబాబు అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios