ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నలభై సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కార్యకర్తల్లో చూస్తున్నానని చెప్పారు.

సీఎం జగన్ మూడేళ్లలో.. 30 ఏళ్లలో కూడా ఎవరూ చేయలేని విధ్వసం చేశారని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు గురువారం విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నలభై సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కార్యకర్తల్లో చూస్తున్నానని చెప్పారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ అభివృద్ది గురించి ఏం చేయాలని ఆలోచిస్తే.. జగన్ మాత్రం విధ్వంసం ఎలా చేయాలో చేసి చూపించాడని మండిపడ్డారు. 30 ఏళ్లలో ఎవరూ చేయని విధ్వసం జగన్ రెడ్డి మూడేళ్లలో చేశారని మండిపడ్డారు. 

ప్రజావేదికతో కూల్చివేతతో మొదలైన విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు. గంజాయి రాష్ట్రానికి చిరునామాగా మార్చారని ఆరోపించారు. జగన్ అప్పులు చేసుకుంటూ పోతున్నారని.. అవి ఎవరూ కట్టాలని ప్రశ్నించారు. జగన్‌ది ఐరన్ లెగ్ అని.. అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి రాష్ట్రం దివాలా తీసిందని విమర్శించారు. జగన్ ఊరికో సైకోను, రౌడీని తయారు చేశారని ఆరోపించారు. ఈ సైకోల నుంచి కాపాడుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పారు. సైకోలను అణచివేసి, మళ్లీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని.. ఆ శక్తి తనకు దేవుడు ఇచ్చాడని చెప్పారు. 

పార్టీకి ఆర్థికంగా సాయం చేసిన, క్షేత్ర స్థాయిలో పనిచేసిన, పార్టీకి ఆలోచన విధానంలో సహాయం చేసిన వారందరినీ పార్టీ గుర్తిస్తుందని హామీ ఇచ్చారు. కార్యకర్తల, నాయకుల పనితనాన్ని ట్రాక్ చేస్తూనే ఉంటామని చెప్పారు. భవిష్యత్ కోసం అందరం పనిచేద్దామని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కోరారు. 

‘‘ఏ నాయకుడు ఎన్ని ఇళ్లు తిరిగారో నేను కూడా మానిటర్ చేస్తాను. ఏ యూనిట్ ఎన్ని ఇళ్లు తిరిగిందనే వివరాలు సేకరిస్తాను. పనిచేసే వాళ్లకే పదవులు. నా చుట్టూ తిరగడం కాదు.. ప్రజల చూట్టూ తిరగాలి. నా చుట్టూ తిరిగితే పదవులు వస్తాయనే భ్రమను వీడాలి. ప్రజలతో ఉన్నవాళ్లకే పదవులు. రాబోయే 30 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉండేలా పనిచేయాలి. ఇది మనకోసం కాదు.. ఈ రాష్ట్రం కోసం’’ అని చంద్రబాబు చెప్పారు. 

కష్టాలు ఉంటాయని.. తన మీదే కేసులు ఉన్నాయని.. కేసులు ఉంటే ఏమవుతుందని ప్రశ్నించారు. ‘‘మనం ఏమన్నా బాబాయ్‌ని చంపామా..?, కోడి కత్తి డ్రామాలాడామా?, లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బును దోచుకున్నామా..?, జైలుకు ఏమన్న వెళ్లామా..?.. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాలి..?, ఎందుకు భయపడాలి..?’’ అని అన్నారు. కేసులకు ఎవరూ భయపడవద్దని.. ఎన్ని కేసులుంటే అంత భవిష్యత్ అని అన్నారు. టీడీపీ అధికారంలో వచ్చాక వాటి సంగతి చూసుకుంటుందని చెప్పారు. కేసులు పెడితే ట్రిబ్యునల్‌ వేస్తాం, దొంగ కేసులు పెట్టిన వారిని శిక్షిస్తామన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.