స్కిల్ డెవలప్  మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబును ఏసిబి కోర్టుకు తరలించారు సిఐడి అధికారులు. 

విజయవాడ : టిడిపి అధికారంలో వుండగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ అరెస్ట్ చేసిన ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును సిఐడి అధికారులు కోర్టుకు తరలించారు. శనివారమే ఆయనను అరెస్ట్ చేసినా అనేక నాటకీయ పరిణామాల మధ్య ఇవాళ విజయవాడలోని ఏసిబి కోర్టుకు తరలించారు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబును ఏ1 గా పేర్కొంటూ సిఐడి రిమాండ్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సిఐడి అధికారులు చంద్రబాబును పటిష్ట బందోబస్తు మద్య కోర్టుకు తరలించారు. ఇక ఇప్పటికే ఏసిబి కోర్టు న్యాయమూర్తి, ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారు. అయితే విచారణను తన చాంబర్ లో చేపడతానని న్యాయమూర్తి సూచించగా చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఓపెన్ కోర్టులోని వాదనలు వినాలని టిడిపి లీగల్ టీం ఏసిబి కోర్టు న్యాయమూర్తిని కోరినట్లు తెలుస్తోంది. 

వీడియో

అయితే సిఐడి అధికారుల సమర్పించిన రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టు అనుమతిస్తుందో లేదో కాసేపట్లో తేలనుంది. ఒకవేళ కోర్టు రిమాండ్ రిపోర్టును అనుమతిస్తే చంద్రబాబుకు 14రోజులు కస్టడీకి కోరుతూ సిఐడి పిటిషన్ దాఖలు చేయనుంది. ఇదే సమయలో బెయిల్ పిటిషన్ దాఖలుచేసేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా సిద్దమయ్యారు. ఒకవేళ సిఐడి రిమాండ్ రిపోర్టును కోర్టు అనుమతించకుంటే చంద్రబాబుకు వెంటనే బెయిల్ లభించే అవకాశాలున్నాయి. 

Read More ఊహించని ట్విస్ట్.. ప్రధాన నిందితుడిగా చంద్రబాబు..

ఇదిలావుంటే చంద్రబాబును అరెస్ట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగారు. నారా లోకేష్, పవన్ కల్యాణ్ లు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లోకేష్ రోడ్డుపై బైఠాయించగా పవన్ అయితే రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. పోలీసులతో వారు తీవ్ర వాగ్వాదానికి దిగారు. చాలాసేపు నిర్భందం తర్వాత వారిని విజయవాడకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.