గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఓటర్లను వైసీపీ భయపెడుతోందని.. ఓడిపోతారన్న భయంతో టీడీపీ సానుభూతిపరులపై వైసిపి నాయకులు దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఓటర్లను వైసీపీ భయపెడుతోందని.. ఓడిపోతారన్న భయంతో టీడీపీ సానుభూతిపరులపై వైసిపి నాయకులు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఓటింగులో పాల్గొనకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''విజయవాడ 8వ డివిజన్ వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి రజనీ భర్త కొత్తపల్లి రాజశేఖర్ టీడీపీ నేత గోగినేని శ్రీధర్ పై దౌర్జన్యానికి దిగారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి నియమించిన 9మంది ఆర్.ఓలలో ఐదుగురు వైసీపీ 4వ వార్డు అభ్యర్థి రామలింగారెడ్డికి చెందిన కాలేజీలో అధ్యాపకులుగా పనిచేస్తుండగా అదే కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో విధులు కేటాయించారు. తిరుపతి 18వ డివిజన్లో దొంగ ఓట్లు వేసేందుకు చెవిరెడ్డి సోదరుడు స్థానికేతరులను తీసుకొచ్చి స్థానిక ఓటర్లను బెదిరిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో అరాచకాలకు, అకృత్యాలకు పాల్పడడం అత్యంత హేయం'' అని చంద్రబాబు మండిపడ్డారు. 

read more మేయర్ అభ్యర్థి, ఎంపీ పరిస్థితే ఇలా వుంటే...: కేశినేని శ్వేత

''వైసీపీ గూండాలకు పోలింగ్ కేంద్రాల్లోకి ఏం పని? ఓటర్లను బెదిరించి పోలింగ్ శాతం పెరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎస్ఈసీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా అదే పద్దతి అనుసరిస్తే.. ప్రజల ఓటుకు విలువ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది'' అని పేర్కొన్నారు. 

''జగన్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత భయంతో ఎన్నికలను హైజాక్ చేసి గెలవాలని చూస్తున్నారు. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ఓటర్లను, అభ్యర్థులను బెదిరిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అధికార పార్టీ దాష్టీకాలను, దుర్మార్గాలను ఎన్నికల సంఘం నిలువరించాలి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి'' అని చంద్రబాబు కోరారు.