ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ విధ్వంసకుడిగా మారాడని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  

అమరావతి: ఏపీ సీఎం Ys Jagan విధ్వంసకుడిగా మారాడాని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళవారం నాడు టీడీపీ చీప్ Chandrababu naidu మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు Amaravati లోనే రాజధాని ఉంటుందని చెప్పలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను అమరావతిలో ఇల్లు కట్టుకొన్నానని కూడా ప్రకటించాడని చంద్రబాబు ప్రస్తావించారుఎన్నికల తర్వాత అమరావతిపై జగన్ మాట మార్చారన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమరావతి కోసం వేల కోట్లతో నిర్మించిన భవనాలు నిరూపయోగంగా ఉన్నాయన్నారు. ప్రజల పన్నులతో ఈ భవనాలను నిర్మించి నిరూపయోగంగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో భవనాల నిర్మాణం కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసినట్టుగా చంద్రబాబు చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను సీఎంగా ఉన్న సమయంలో సైబరాబాద్ ను నిర్మిస్తే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేశారన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా వేదికలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించి అదే ప్రజా వేదికను జగన్ కూల్చి చేశారన్నారు.తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. వైసీపీ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పారు. 

ప్రజల ఆస్థి విధ్వంసంతోనే వైసీపీ నేతల ఉన్మాదం బయటపడిందన్నారు. దీనికి కొనసాగింపుగానే అమరావతి విధ్వంసం మొదలు పెట్టారని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజధాని కోసం 50 వేల ఎకరాలు భూమిని రైతులు స్వచ్ఛంధంగా ఇచ్చారన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన పాపానికి రైతులు అవమానాలు పడాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి, పోలవరం పూర్తైతేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు.

పోలవరం డీపీఆర్‌ను ఎందుకు ఖరారు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయడం మీకు చేతనవుతుందా అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. పోలవరంపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా?’’ అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాజెక్టులు తేవడం విధ్వంసం చేసినంత సులువు కాదన్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసినట్లు తెలిపారు. ఆ పెట్టుబడులు వస్తే 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు.

వైసీపీకి చెందిన నేతలు తమ పార్టీకి ప్రజా ప్రతినిధులపై ఫిర్యాదులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాలోని వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రిపై వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులపై చంద్రబాబు ఈ సందర్భంగా పరోక్షంగా గుర్తు చేశారు. తాను లేవనెత్తిన అంశాలపై వైసీపీ నేతలతో తాను చర్చకు సిద్దమని ఆయన చెప్పారు. తాను లేవనెత్తిన అంశాలపై చర్చకు సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగుతారన్నారు.