అమరావతి భూములపై సిఐడి నోటీసులు: హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
అమరావతి భూములపై ఏపీ సిఐడి ఇచ్చిన నోటీసులపై టీడీపీ చీఫ్ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: అమరావతి భూముల కేసులో తనకు ఆంధ్రప్రదేశ్ సీఐడి జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఆయన సవాల్ చేసారు. ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు.
అమరావతి భూముల కేసులో ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబు పిటిషన్ మీద హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. అమరావతి భూముల కేసులో ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు జారీ చేసిన విషయం చేసిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని సిఐడి నారాయణకు నోటీసులు ఇచ్చింది. ఇదే వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు.
హైదరాబాదులోని నారాయణ నివాసానికి సిఐడి అధికారులు వచ్చారు. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందజేశారు. తన భర్త సిఐడి అధికారుల ముందు హాజరవుతారని రమాదేవి చెప్పారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులుర తమ నోటీసులో సూచించారు.
చంద్రబాబు మంత్రివర్గంలో ఆయన పనిచేస్తూ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి ఆరోపిస్తోంది. అమరావతి ప్రాంతంలో భూముల వ్యవహారంపై వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరిపిన సిఐడి కేసులు నమోదు చేసింది.