టిడిపి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రజనీకాంత్... చంద్రబాబు, బాలయ్యతో కలిసి ఒకే వేదికపై
విజయవాడ శివారులో మరో మూడురోజుల్లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి సభకు ముఖ్య అతిథిగా హీరో రజనీకాంత్ హాజరవుతారని టిడిపి ప్రకటించింది.
![Tamil Actor Rajanikanth Chief guest in NTR Hundred years birth celebrations AKP Tamil Actor Rajanikanth Chief guest in NTR Hundred years birth celebrations AKP](https://static-ai.asianetnews.com/images/01esjc7ammpaxv79hx8nxngtat/rajaaa-jpg_363x203xt.jpg)
విజయవాడ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది టిడిపి.గతేడాది మే 28న ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు సందర్భంగా ఏడాది పొడవునా శతజయంతి వేడుకలు జరపనున్నట్లు ఆయన తనయుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కమిటీ ఛైర్మన్ టిడి జనార్ధన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ నెల 28న కృష్ణా జిల్లా విజయవాడ శివారులో ఘనంగా నిర్వహించనున్న ఎన్టీఆర్ శతజయంతి సభకు తమిళ స్టార్ రజనీకాంత్ హాజరుకానున్నట్లు టిడి జనార్ధన్ తెలిపారు. టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణతో పాటు టిడిపి నాయకులందరూ పాల్గొంటారని జనార్ధన్ వెల్లడించారు.
Read More పొలిటికల్ ఎంట్రీపై ప్రొద్దుటూరులో పోస్టర్లు: టీడీపీ నేతలతో వైఎస్ సునీతారెడ్డి ఫోటోలు
ఎన్టీఆర్ శత జయంతి సభ కోసం తాడిగడప వంద అడుగుల రోడ్డులో వేదిక ఏర్పాటు పనులను ఇవాళ టిడిపి నాయకులు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడి జనార్ధన్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఒక చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ పేరుతో సావనీర్, యాప్, వెబ్ సైట్, ఆయన ప్రసంగాలు పుస్తకం రూపంలో అందుబాటులోకి తెచ్చేలా పని చేస్తున్నామన్నారు. గత ఎనిమిది నెలలుగా మా కమిటీ వీటి మీద పని చేసిందన్నారు. "ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు మరియు ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు" పుస్తకాన్ని రజనీకాంత్ ఆవిష్కరించనునన్నారని జనార్ధన్ వెల్లడించారు.
వీడియో
ఈనెల28న అనుమోలు గ్రౌండ్ లో యన్టీఆర్ శత జయంతి సభ ఉంటుందని... ఇందులో నాజర్ కొడుకు బాబ్జీతో ఎన్టీఆర్ చరిత్రపై బుర్రకథ ప్రదర్శిస్తామని అన్నారు. ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయని తెలిపారు. ఎన్టీఆర్ యాప్ ను నారా లోకేష్ ప్రారంభిస్తారని తెలిపారు. ఇక వెబ్ సైట్, సావనీర్ ను త్వరలోని హైదరాబాద్ లో ఆవిష్కరిస్తామని టిడి జనార్ధన్ వెల్లడించారు.
టిడిపి చీఫ్ చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణతో వున్న సత్సంబంధాల కారణంగానే పార్టీ కార్యక్రమానికి రజనీకాంత్ హాజరవుతున్నారు. ఇటీవల రజనీకాంత్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్ళి భేటీ అయ్యారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులతో పాటు వ్యక్తిగత విషయాల గురించి వీరిద్దరూ ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ శతజయంతి సభకు చంద్రబాబు ఆహ్వానం పలకడంతో రజనీకాంత్ ఒప్పుకున్నట్లు టిడిపి నేతల చెబుతున్నారు.