16 కేజీల అర్జీలు ఇచ్చా .. వాటి తూకంతో మీకే రూ.750, స్పందన శుద్ధ దండగ : జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు
స్పందన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాను రెండేళ్ల కాలంలో 16 కేజీల ఆర్జీలను స్పందన కార్యక్రమంలో అధికారులకు ఇచ్చానని.. తాను పెట్టిన అర్జీలను తూకంలో అమ్మితే 750 రూపాయలు వచ్చాయని చురకలంటించారు.
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్నిరోజులుగా ఆయన వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా స్పందన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీని వల్ల సమయం వృథా కావడం తప్పించి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. గడిచిన రెండేళ్లలలో తాను స్పందన కార్యక్రమంలో అనేక దరఖాస్తులను ఇచ్చానని.. కానీ వాటిలో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని జేసీ తెలిపారు.
సమస్యలు పరిష్కరించని కార్యక్రమం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాను రెండేళ్ల కాలంలో 16 కేజీల ఆర్జీలను స్పందన కార్యక్రమంలో అధికారులకు ఇచ్చానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాను పెట్టిన అర్జీలను తూకంలో అమ్మితే 750 రూపాయలు వచ్చాయని చురకలంటించారు. అవసరమైతే అధికారుల కాళ్లు పట్టుకుంటాని.. తాను లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.
ALso Read: కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన: తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆందోళన
ఇకపోతే.. టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లకు కమిషనర్ సహకరించడం లేదని మున్సిపల్ కార్యాలయం వద్దే చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. గత సోమవారం నాటి నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి తన నిరసనను కొనసాగిస్తున్నారు. ఆరోజు రాత్రి మున్సిపల్ కార్యాలయం వద్దే జేసీ ప్రభాకర్ రెడ్డి నిద్రించారు. మంగళవారం నాడు ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్దే బ్రష్ చేసి, అక్కడే స్నానం చేశారు. తాడిపత్రి మున్సిపల్ అభివృద్దికి కమిషనర్ అడ్డుపడుతున్నాడని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాడిపత్రి అభివృద్దికి ప్రభుత్వం నిధులు అందించడం లేదని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు.