ఆస్తుల కేసు: సుప్రీం ఆదేశాలతో చంద్రబాబుకు షాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరిగి విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరిగి విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 2005లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ జరపాలని ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.
అయితే లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు తెచ్చుకున్న స్టే కూడా రద్దయింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఏసీబీ కోర్టు కేసు విచారణను మొదలుపెట్టింది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ అయ్యాయి. ఆమె శుక్రవారం కోర్టుకు కేసు స్టేటస్పై హాజరయ్యారు. హైదరాబాద్ ఏసీబీ కోర్టు వచ్చేనెల 13న విచారణ చేపట్టనుంది.