తిరుమలలో ఆలయ ముఖద్వారం దగ్గర శ్రీవారి హుండీ లారీలోకి ఎక్కిస్తుండగా జారి కిందపడిపోయింది. 

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహా ద్వారం దగ్గర ఉన్న స్వామివారి హుండీ ఒక్కసారిగా పడిపోయింది. శ్రీవారి హుండీని ఆలయం నుండి లారీలో పరకామణికి తరలిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఒకసారిగా హుండీ కింద పడడంతో హుండీలో ఉన్న కానుకలు చెల్లాచెదురయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కానుకలను తీసి హుండీలో వేశారు. ఆ తర్వాత హుండీని జాగ్రత్తగా లారీలోకి ఎక్కించారు. ఆ తరువాత అక్కడినుంచి పరకామణికి తరలించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తమ శక్తి మేరకు ఆపదమొక్కుల వాడికి కానుకలు సమర్పించుకుంటుంటారు. కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కుల రూపంలో వాటిని తీర్చుకుంటారు.

ఈ మొక్కులు నగదు, ఆభరణాల రూపాల్లో ఉంటుంటాయి. శ్రీవారి హుండీ ఆదాయంలో కోట్లలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానుకలు సమర్పించడానికి శ్రీవారి హుండీని పరమపవిత్రమైనదిగా భక్తులు నమ్ముతుంటారు. అలాంటి హుండీ జారి పడడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దీనిమీద టీటీడీ అధికారులు స్పందించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.