ఏపీ అసెంబ్లీ... ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సభ నుంచి ముగ్గురు టీడీపీ నేతలకు స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెన్షన్ విధించారు . అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడలను సస్పెండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కాగా... సభ ప్రారంభమైన కాసేపటికే గందరగోళం మొదలైంది. అధికార, విపక్షాల మధ్య వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో జగన్... పెన్షన్ల పై ఇచ్చిన హామీలపై సభ ప్రారంభం కాగా... దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా పెన్షన్లు అమలు చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాం తారా స్థాయికి చేరడంతో.. సభలో గందరగోళం నెలకొంది.
అయితే...దీనిపై సీఎం జగన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం ఏం చేప్పానో అదే అమలు చేస్తున్నానని అన్నారు. మోసాలు చేయడం తమ ఇంటా, వంటా లేదని జగన్ అన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష నేతలు వినిపించుకోలేదు.
ఈ క్రమంలో సభ నుంచి ముగ్గురు టీడీపీ నేతలకు స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెన్షన్ విధించారు . అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడలను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. కాగా... వారు బయటకు వెళ్లడానికి అయిష్టత వ్యక్తం చేయడంతో... వారిని మార్షల్స్ ఎత్తుకెళ్లి మరీ బయట వదిలేయడం గమనార్హం.