విషసర్పాలను అలవోకగా పట్టి బంధించే ఆ వ్యక్తి.. చివరికి ఆ పాము కాటుకే బలైన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీకాకుళం : పాములు పట్టే ఓ వ్యక్తి ఆ పాము కాటుకే బలైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పాములు పట్టడంలో ఆరితేరిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు ఆ వ్యక్తి. చివరికి పాములు పట్టే క్రమంలో ఆ పాము కాటుకే గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని గాంధీనగర్ నాలుగో వీధిలో ఉండే గుడ్ల రామ జోగి (60) ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు.
14 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఆయనకి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. రామ జోగికి పాములను పట్టుకోవడంలో మంచి నేర్పరితనం ఉంది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారికి ఎప్పుడు ఏదైనా అవసరం వస్తే వెంటనే వెళ్లి ఆదుకునేవాడు. అలా పాము కనిపిస్తే చాలు రామజోగి కి ఫోను వచ్చేది. అతను కూడా వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడ వాలిపోయేవాడు. పామును పట్టుకుని.. బాధితులకు స్వాంతన చేకూర్చేవాడు.
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య..
అలా నరసన్నపేటలో రామ జోగి ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీన సబ్ ట్రెజరీ కార్యాలయం దగ్గర పాము కనిపిస్తే దాన్ని పట్టుకుని దూరంగా వదిలేశాడు. అంతకు ముందు ఫిబ్రవరి 27న పోలీస్ స్టేషన్ సమీపంలో పాములు కనిపిస్తే పట్టుకుని దూరంగా విడిచి పెట్టాడు. అలాగే ఈనెల 19వ తేదీన తామరపల్లిలో ఓ పాము కనిపించింది. వెంటనే వారు రామ జోగికి ఫోన్ చేశారు. ఆ పామును పట్టుకోవడానికి రామజోగి అక్కడికి వెళ్ళాడు. అందరూ అనుకున్నట్టుగానే పామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు. దాన్ని తీసుకువెళ్లి దూరంగా విడిచి పెడుతుండగా.. అది ఒక్కసారిగా రామ జోగిని కాటేసింది.
అతనితో పాటు వెళ్లినవారు వెంటనే గ్రహించి రామ జోగిని శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ రామజోగి గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన మృతికి సంబంధించి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.
