జగన్ వైపు: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అనర్హత, నేడు మంత్రులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపై ఆరేళ్ల క్రితం ఇదే రోజున అనర్హత వేటు పడింది
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపై ఆరేళ్ల క్రితం ఇదే రోజున అనర్హత వేటు పడింది. ఆనాడు ఏ రోజున అనర్హతకు గురైన నలుగురు ఎమ్మెల్యేలు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్ కేబినెట్లో మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు.కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఆనాడు అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.
అయితే ఈసమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్ణయానికి మద్దతుగా ఆనాడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు పేర్నినాని, ఆళ్లనాని, తానేటి వనిత, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఓటు చేశారు.
కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ఈ ఎమ్మెల్యేలు రెండు పార్టీల విప్ను ధిక్కరించినందుకుగాను ఎమ్మెల్యేలపై వేటు పడింది.2013 జూన్ 8వ తేదీన ఆళ్ల నాని, పేర్ని(నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( కాంగ్రెస్), తానేటి వనిత, కొడాలి నాని(టీడీపీ)లపై అనర్హత వేటు పడింది.
ఆరేళ్ల క్రితం అనర్హత వేటు పడిన రోజునే ఈ నలుగురు కూడ వైఎస్ జగన్ మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలుగా అనర్హతకు గురైన రోజునే మంత్రులుగా ప్రమాణం చేయడం యాధృచ్ఛికమే. అయితే తనను నమ్ముకొన్న వారికి జగన్ పదవులు కట్టబెడుతారని జగన్ నిర్ణయంతో తేలిందని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.
2013 మార్చి 15వ తేదీన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ప్రభుత్వానికి అనుకూలంగా, అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని కోరింది.
టీడీపీ మాత్రం అవిశ్వాసానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ఈ విప్లకు అనుగుణంగా వ్యవహరించలేదని ఈ రెండు పార్టీలు స్పీకర్కు ఫిర్యాదు చేశాయి. దీంతో స్పీకర్ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సుజయ కృష్ణ రంగారావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, ఆళ్లనాని, గొట్టిపాటి రవికుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్, జోగి రమేష్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎం. రాజేష్లపై అనర్హత వేటు పడింది. టీడీపీకి చెందిన ఎన్. అమర్నాథ్ రెడ్డి, ఏవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తానేటి వనిత, పి.సాయిరాజ్, కొడాలినాని, వై. బాలనాగిరెడ్డి లపై అనర్హత వేటు వేశారు.
అయితే 2014 తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో వైసీపీ నుండి విజయం సాధించిన సుజయకృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్లు టీడీపీలో చేరారు. ఈ దఫా ఎన్నికల్లో రవికుమార్ ఒక్కడే మరోసారి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.
2013లో జగన్కు మద్దతుగా నిలిచినందుకు గాను అనర్హత వేటు పడిన పేర్ని నాని, తానేటి వనిత, ఆళ్లనాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.
ఆరేళ్ల క్రితం టీఆర్ఎస్ ప్రతిపాదించిన అవిశ్వాసానికి వైసీపీ మద్దతును ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో వారిపై అనర్హత వేటు పడింది.
సంబంధిత వార్తలు
ఊరట: చీప్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి, విప్లుగా చెవిరెడ్డి, పార్ధసారథి
గడికోట శ్రీకాంత్ రెడ్డికి చీప్ విప్ పదవి: సచివాలయానికి జగన్ (లైవ్ అప్డేట్స్)