తొలి జాబితాలో  టిక్కెట్టు దక్కని తెలుగు దేశం నేతలు అసంతృప్తితో ఉన్నారు.  కొన్ని నియోజకవర్గాల్లో  నిరసనలకు కూడ చోటు చేసుకున్నాయి.

అమరావతి: తెలుగుదేశం-జనసేన తొలి జాబితాను ప్రకటించింది.ఈ జాబితాలో టిక్కెట్లు దక్కని తెలుగు దేశం పార్టీ శ్రేణులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు నిరసనలకు దిగాయి.తెలుగుదేశం-జనసేన కూటమి ఇవాళ 99 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 94 మందిలో 23 మంది కొత్త వాళ్లు. అయితే ఈ జాబితాలో కొందరు సీనియర్లకు టిక్కెట్టు దక్కలేదు. బీజేపీతో పొత్తు కారణంగా ఇంకా 57 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మార్చి తొలి వారంలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా విడుదల: 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన

అయితే ఇవాళ ప్రకటించిన జాబితాలో టిక్కెట్టు దక్కని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు టిక్కెట్టు కేటాయించకపోవడంపై పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు.ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో కొండపల్లి శ్రీనివాస్ కు తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు కేటాయించింది. దీంతో ఇంచార్జీగా ఉన్న కేఏ నాయుడు రాజీనామా చేశారు. గజపతినగరం టిక్కెట్టును కేఏ నాయుడికే కేటాయించాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకు దిగారు. పెనుకొండ అసెంబ్లీ స్థానాన్ని సవితకు కేటాయించారు. దీంతో బీ.కే. పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు. బీ.కే. పార్థసారథికి ఎంపీ టిక్కెట్టు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.ఇందులో భాగంగానే పార్థసారథికి పెనుకొండ టిక్కెట్టు కేటాయించలేదని ప్రచారం కూడ లేకపోలేదు.

also read:టీడీపీ-జనసేన తొలి జాబితా: 14 మంది మహిళలు, 23 మంది కొత్తవాళ్లకు చోటు

అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అయితే అనకాపల్లి సీట్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వర్గీయులు నిరసనకు దిగారు.కళ్యాణదుర్గంలో సురేందర్ బాబుకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు కేటాయించింది. అయితే మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు.

ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి టిక్కెట్టును రాంప్రసాద్ రెడ్డికి కేటాయించింది తెలుగుదేశం పార్టీ. అయితే ఈ టిక్కెట్టును రమేష్ రెడ్డి ఆశించారు. తనను సంప్రదించకుండానే రాంప్రసాద్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించడంపై రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టుగా రమేష్ రెడ్డి తెలిపారు.

also read:తొలి జాబితా: టీడీపీ సీనియర్లకు దక్కని చోటు, ఎందుకంటే?

పి.గన్నవరం అసెంబ్లీ స్థానంలో మహసేన రాజేష్ కు టిక్కెట్టు కేటాయించింది తెలుగు దేశం. ఈ టిక్కెట్టు కోసం ఆశించిన నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పి.గన్నవరం మండల పార్టీ అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేశారు.డోన్ అసెంబ్లీ స్థానానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరును ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.అయితే డోన్ అసెంబ్లీ స్థానంలో సుబ్బారెడ్డిని ఇంచార్జీగా గతంలో ప్రకటించారు. అయితే తనను కాదని సూర్యప్రకాష్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించడంపై సుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అనుచరులతో సమావేశమై కార్యాచరణను ప్రకటిస్తానని సుబ్బారెడ్డి ప్రకటించారు.