Asianet News TeluguAsianet News Telugu

తొలి జాబితా: టీడీపీ సీనియర్లకు దక్కని చోటు, ఎందుకంటే?


తెలుగు దేశం పార్టీలో సీనియర్లకు తొలి జాబితాలో అవకాశం దక్కలేదు. అయితే ఇందుకు  పలు కారణాలను  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  నాలుగైదు రోజుల్లో రెండో జాబితాను  ప్రకటించే అవకాశం లేకపోలేదు.

Several TDP Senior Leaders not Getting seats in TDP-Janasena First list lns
Author
First Published Feb 24, 2024, 1:55 PM IST

అమరావతి: తెలుగుదేశం, జనసేన ఉమ్మడి జాబితాలో  తెలుగు దేశం పార్టీ సీనియర్లకు  చోటు దక్కలేదు.ఈ కూటమిలో  బీజేపీ చేరితే ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయమై ఈ రెండు పార్టీలు చర్చించనున్నాయి.  తొలి జాబితాలో  94 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది.  జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే  ఇవాళ ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ఆ పార్టీ ప్రకటించింది.

తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న కొందరు సీనియర్లకు  తొలి జాబితాలో చోటు దక్కలేదు.  రెండో జాబితాలో  వీరికి చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గురజాల అసెంబ్లీ స్థానంలో గతంలో పలు దఫాలు ప్రాతినిథ్యం వహించిన యరపతినేని శ్రీనివాసరావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదు.  వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పిన జంగా కృష్ణమూర్తి తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  గురజాలలో  జంగా కృష్ణమూర్తిని బరిలోకి దింపుతారా, లేదా అనే విషయం రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.  నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పిన లావు కృష్ణదేవరాయలును  టీడీపీ బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం లేకపోలేదు. ఇదే పార్లమెంట్ స్థానం నుండి  మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను  వైఎస్ఆర్‌సీపీ  బరిలోకి దింపుతుంది. దీంతో  బీసీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో గురజాల అసెంబ్లీ సీటును పెండింగ్ లో పెట్టిందనే ప్రచారం కూడ లేకపోలేదు.

also read:టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా విడుదల: 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన

రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే రాజమండ్రి రూరల్ నుండి  జనసేన పోటీ చేయనుందనే ప్రచారం సాగుతుంది. కందుల దుర్గేష్ ను ఆ పార్టీ బరిలోకి దింపనున్నట్టుగా  ప్రచారం సాగింది.అయితే  ఈ విషయమై సాగుతున్న ప్రచారంపై  క్యాడర్ అధైర్యపడవద్దని  గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే  రాజమండ్రి అసెంబ్లీ సీటు విషయంలో  ఆశావాహులకు న్యాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. 

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  గతంలో సర్వేపల్లి నుండి ప్రాతినిథ్యం  వహించారు. అయితే  తొలి జాబితాలో  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చోటు దక్కలేదు. రెండో జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చోటు దక్కే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుండి  మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీ కోరింది.  అయితే ఈ విషయమై  తన ఆలోచనను పార్టీ నాయకత్వానికి చెబుతానని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. వేరే జిల్లాకు వెళ్లి పోటీ చేసే విషయమై  తాను తన సన్నిహితులతో చర్చిస్తున్నట్టుగా  చెప్పారు.  విశాఖపట్టణం నుండి పోటీ చేయడమే తనకు ఆసక్తి ఉందని గంటా శ్రీనివాసరావు చెప్పారు.2019 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు విశాఖపట్టణం నార్త్ అసెంబ్లీ నుండి విజయం సాధించారు.  బీజేపీతో టీడీపీ, జనసేన మధ్య పొత్తుంటే  విశాఖపట్టణం నార్త్ స్థానాన్ని బీజేపీ కోరే అవకాశం లేకపోలేదు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి అసెంబ్లీ స్థానం నుండి పోటీకి  గంటా శ్రీనివాసరావు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం లేకపోలేదు. అయితే ఈ స్థానం నుండి జనసేన నుండి  వంశీ యాదవ్ పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడ తెరమీదికి వచ్చింది.దరిమిలా  గంటా శ్రీనివాసరావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదనే రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.  దెందులూరు అసెంబ్లీ స్థానం నుండి గతంలో చింతమనేని ప్రభాకర్ తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించాడు. చింతమనేని ప్రభాకర్ కు తొలి జాబితాలో చోటు దక్కలేదు.

మైలవరం అసెంబ్లీ స్థానం నుండి గతంలో  దేవినేని ఉమ మహేశ్వరరావు తెలుగు దేశం పార్టీ నుండి ప్రాతినిథ్యం వహించారు. అయితే  మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్  తెలుగు దేశం పార్టీలో  చేరుతారనే ప్రచారం సాగుతుంది. దీంతో  దేవినేని ఉమ పేరును  తొలి జాబితాలో చోటు దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

టీడీపీ, జనసేనలు తొలి జాబితాలో  118 స్థానాల్లో  పోటీ చేయనున్నట్టుగా ప్రకటించాయి. అయితే  మిగిలిన 57 స్థానాలున్నాయి.అయితే ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  ఈ నెల  28 నాటికి ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని  తెలుగు దేశం వర్గాలు చెబుతున్నాయి.  బీజేపీ నుండి స్పష్టత వచ్చిన తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో  పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios