సస్పెన్షన్ ఎత్తివేత తర్వాత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తొలిసారి ఏపీ సచివాలయానికి వచ్చారు. తన పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానని .. ఇందుకు అవసరమైన ఆదేశాలివ్వాలని కోరినట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 

చాలా కాలం తర్వాత సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ సచివాలయానికి వచ్చారు. యూనిఫాంలో ఆయన సెక్రటేరియట్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ఆయన సెక్రటేరియట్‌కు వచ్చారు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు వెంకటేశ్వరరావు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎస్ సమీర్ శర్మకు రిపోర్ట్ చేయడానికి వచ్చానని తెలిపారు. తన పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఇందుకు అవసరమైన ఆదేశాలివ్వాలని సీఎస్‌ని కోరినట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 

కాగా... AB Venkateswara Rao సస్పెన్షన్ ను Supreme Court శుక్రవారం నాడు రద్దు చేసిన సంగతి తెలిసిందే. High Court ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏబీ వెంకటేశ్వరరావును మళ్లీ సర్వీసుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల రూల్స్ ప్రకారంగా సస్పెన్షన్ రెండేళ్లకు మించి ఉండకూడదని ఏబీ వెంకటేశ్వరరావు తరపున న్యాయవాది వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన SLPని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సస్పెన్షన్ రెండేళ్లు ముగిసనందున ఇకపై సస్పెన్షన్ అమల్లో ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది. 

నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును YS Jagan ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో Suspend చేసింది. Chandrababu Naidu సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలను ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది. అంతేకాదు ఆయనను సస్పెండ్ చేసింది. 

తనపై విధించిన సస్పెన్షన్ ముగిసిందని ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 25న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా లేఖ రాశారు. 2021 జూలైలో తనపై విధించిన సస్పెన్షన్ ను చివరిసారిగా పొడిగించిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తనకు కూడా కాపీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎలా చూసినా కూడా తన సస్పెన్షన్ ముగిసిందని ఆయన తేల్చి చెప్పారు.

ఆయన ఈ లేఖ రాసిన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసెస్ అంశంపై చర్చ జరిగింది. ఈ విషయమై హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. 2019 మే వరకు పెగాసెస్ సహా ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనకు పీఎస్ సమీర్ శర్మ షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీనికి ఏబీ సమాధానమిచ్చారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకే తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినట్టుగా వివరణ ఇచ్చారు.