తిరుపతిలో సీప్లేన్ సేవలు ప్రారంభానికి రంగం సిద్ధం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉడాన్ పథకం కింద ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రధాన కేంద్రంగా ఉన్న తిరుపతి నగరంలో త్వరలోనే సీప్లేన్ ప్రయాణ సేవలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద ఈ ప్రాజెక్టు తీసుకురానుంది. దీని ముఖ్య ఉద్దేశం పర్యాటకాన్ని ప్రోత్సాహించడమే కాకుండా, అంతరించిపోతున్న ప్రాంతాలకు వైమానిక సేవలు అందించడం కూడా.
ఈ క్రమంలో తిరుపతికి సమీపంలో ఉన్న కల్యాణి ఆనకట్టను నీటి విమానాశ్రయంగా అభివృద్ధి చేయనున్నారు. ఇది ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఇప్పటికే విజయవాడ నుంచి శ్రీశైలం మార్గంలో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంతో, తిరుపతిలో సేవలు త్వరితంగా అమలు చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికిగాను, ఫీడ్బ్యాక్ అనే కన్సల్టింగ్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. వారు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను (డీపీఆర్) తయారు చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్ పూర్తయిన తర్వాత తదుపరి దశల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మొదలవుతుంది.తిరుపతి ఎంపిక వెనుక పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. దీంతో తిరుపతిలో ఈ పథకాన్ని ప్రవేశ పెడితే పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకుపోతుందనే ఉద్ధేశంతో ఇక్కడ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
అలాగే, తిరుమలతో పాటు కపిల తీర్థం, గోవిందరాజ స్వామి ఆలయం, చంద్రగిరి కోట వంటి పర్యాటక ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ తరహా రాకపోకలకు వేగవంతమైన మార్గం కావాలన్నదే సీప్లేన్ ప్రాజెక్టు పునాదిగా మారింది. తిరుపతి ఇప్పటికే విమానాశ్రయం కలిగిన నగరంగా ఉండడం వల్ల, సీప్లేన్ సేవలతో అనుసంధానం సులభతరం కానుంది. ప్రస్తుతానికి ప్రణాళిక దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) మద్దతు ఇస్తోంది. డీపీఆర్ పూర్తయిన తర్వాత నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈవిధంగా చూస్తే, 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో సీప్లేన్ ప్రయాణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.