Cyclone Michaung : దంచికొడుతున్న వర్షం.. అధికారులు అలర్ట్ , ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సోమ, మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సచివాలయ సిబ్బంది అందుబాటులో వుండాలని, ప్రజలకు అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు.
![schools and colleges holidays in prakasam district due to Cyclone Michaung ksp schools and colleges holidays in prakasam district due to Cyclone Michaung ksp](https://static-ai.asianetnews.com/images/01hg8h2vwwr5s8fbpa4s2z7dzt/gettyimages-1786964505-594x594-1701093404572_363x203xt.jpg)
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నస్టం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. సోమ, మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సచివాలయ సిబ్బంది అందుబాటులో వుండాలని, ప్రజలకు అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు.
ఇకపోతే.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని ఆయన అలర్ట్ చేశారు. ‘‘మైచౌంగ్’’ తుఫాను ఈ నెల 4న నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం వుండటంతో అధికారులంతా సన్నద్ధంగా వుండాలని జగన్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదని, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు తుఫాను ప్రభావిత జిల్లా కలెక్టర్లు సిద్ధంగా వుండాలని జగన్ ఆదేశించారు.
ALso Read: Cyclone Michaung : రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో 140కి పైగా రైళ్లు రద్దు, లిస్ట్ ఇదే
కరెంట్, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి తాగునీరు, ఆహారం, పాలు వంటివి అందుబాటులో వుంచుకోవాలని.. అలాగే వైద్య సేవలను కూడా అందజేపయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు.
అటు మైచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140కి పైగా రైళ్లు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో డిసెంబర్ 3 నుంచి 6 వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తున్నామని, మరికొన్నింటినీ పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.