కీలక మలుపు తిరిగిన ‘దుర్గ’ వివాదం
- విజయవాడ కనకదుర్గ ఆలయ వివాదం కొత్త మలుపు తిరిగింది.
విజయవాడ కనకదుర్గ ఆలయ వివాదం కొత్త మలుపు తిరిగింది. పోయిన డిసెంబర్ నెల 26వ తేదీన విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో క్షుద్రపూజలు జరిగాయన్న విషయం వెలుగూచూడటంతో సంచలనం మొదలైంది. అదే విషయమై బుధవారం విశాఖపట్నంలోని శారధాపీఠాపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
త్వరలో పీఠాధిపతులతో ఓ సమావేశం నిర్వహిస్తానంటూ చెప్పారు. సాత్వికంగా ఉండే దుర్గ అమ్మవారికి క్షుద్రపూజలు జరిపించటం అరిష్టమని మండిపడ్డారు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం పెరిగిపోవటం వల్లే ఇటువంటి అనర్ధాలు జరుగుతున్నట్లు ధ్వజమెత్తారు. ఈ విషయమై కోర్టుకు కూడా వెళతానంటూ హెచ్చరించారు.
అయితే, తాంత్రికపూజలు జరిగాయన్న విషయంపై ఆలయ అధికారులు కానీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు. పైగా ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి పూజలు జరగలేదంటూ ఆలయ అధికారులు చెబుతున్నారు.
అయితే, ఈ విషయంపై రోజురోజుకు వివాదం పెరుగుతుండటంతో తప్పని పరిస్ధితిల్లో ఆలయ ఇవో సూర్యకుమారి అధికారికంగా స్పందించారు. ఆలయంలో ఎటువంటి పూజలు జరగలేదని కేవలం శుద్ధిమాత్రమే జరిగిందని చెప్పారు. అయితే, ఇక్కడే ఇవో దొరికిపోయారు. ఎందుకంటే, ఆలయాన్ని రాత్రి 9 గంటలకు మూసేస్తే తెల్లవారుజామున 3 గంటలకు తెరుస్తారు. అయితే, ఇవో చెబుతున్నది తప్పని సిసి టివి ఫుటేజీలు చెబుతున్నాయి. రాత్రి 11.30 గంటల నుండి తెల్లవారుజామున 1.30 గంటల వరకూ కొందరు పూజారులు ఆలయంలో ఉన్నట్లు స్పష్టంగా కనబడుతోంది.
విచిత్రమేమిటంటే, సిసి టివిల్లో కనిపించిన పూజారుల్లో ముగ్గురు ఆలయానికి ఎటువంటి సంబంధం లేనివారే కావటంతో వివాదం మరింత రాజుకుంది. వివాదం బాగా పెద్దదవటంతో పోలీసులు ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయంలో తాంత్రికపూజలు జరిగినట్లుగా పూజారులు అంగీకరంచారట. అంటే ఇన్ని రోజులూ ఇవో అబద్దాలు చెప్పారన్న విషయం స్పష్టమైపోయింది. కాకపోతే ఆ పూజలు ఎందుకు జరిపించారు? ఎవరి కోసం జరిపించారన్న విషయమే తేలాలి.
సరే, ఈ విషయమై వైసిపి నేతలు మాట్లాడుతూ, లోకేష్ కోసమే ఆలయంలో తాంత్రికపూజలు జరిపించారని ఆరోపణలు చేయటం అందరికీ తెలిసిందే. మొత్తానికి పూజలు జరగటం వెనుక ప్రభుత్వంలోని ‘ముఖ్యులు’ ఎవరో ఉన్నట్లు అనందిరిలోనూ అనుమానాలున్నాయి. కాకపోతే అందుకు ఆధారాలే దొరకాలి.