కోర్టులు రక్షించినా...అది మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు: చంద్రబాబుకు సజ్జల హెచ్చరిక
భారీ వర్షాలతో కృష్ణా నది పోటెత్తడంతో మరోసారి మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై చర్చ మొదలయ్యింది.
అమరావతి: ఏపీతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది పోటెత్తింది. ఇప్పటికే వరద నీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణా నదికి అత్యంత సమీపంలో వున్న భవనాలను హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై చర్చ మొదలయ్యింది. కోర్టుల నుండి రక్షణ పొందినా వరద మాత్రం వదిలిపెట్టదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హెచ్చరించారు.
''చంద్రబాబుగారూ... కృష్ణానదికి వరద వస్తోంది. ఇకనైనా మీరు చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్హౌస్ను ఖాళీచేయండి. కోర్టుల ద్వారా రక్షణ పొందినా, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా పైనుంచి వచ్చిన వరద మీ ఇంటిని ముంచివేయక మానదుకదా?'' అంటూ సజ్జల ట్వీట్ చేశారు.
read more ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం (వీడియో)
ఈ ట్వీట్ కు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనదైన రీతిలో కౌంటరిచ్చారు. ''రకరకాల పిటిషన్లు వేసి 10 ఏళ్ళు గడిపేసారు. ఇప్పటికైనా దోచుకున్న సొత్తు ప్రజలకు ఇచ్చేయండి లేకపోతే మరోసారి జైలుబాట తప్పదు. చట్టాల గురించి లెక్చర్లు ఇస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి ముందు అక్రమ సొత్తుతో కట్టిన ఇళ్లను ఖాళీ చెయ్యమని జగన్ రెడ్డి గారిని డిమాండ్ చెయ్యాలి'' అని సూచించారు.
''43 వేల కోట్ల ప్రజా ధనం దోపిడీ, యాలహంక రాజప్రసాదం, లోటస్ పాండ్ ప్యాలస్, తాడేపల్లిలో విలాసవంతమైన విల్లా, పేదల భూములు కొట్టిసి కట్టిన ఇడుపులపాయ ఎస్టేట్, దొంగ సొమ్ముతో పెట్టిన సాక్షి, క్విడ్ ప్రో కో తో పెట్టిన భారతి సిమెంట్స్ ఇలా అనేక ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది'' అన్నారు.
''వైఎస్ జగన్..ఇప్పటికైనా అక్రమాస్తులు ప్రభుత్వ ఖజానాకి జమ చేసి చట్టాన్ని గౌరవించండి. ఏడాదిలో రాజకీయ నాయకుల పై పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ పూర్తి చెయ్యాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది'' అంటూ సజ్జల ట్వీట్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు అయ్యన్న.