తిరుమలలో కూతురు, బృందావనంలో తల్లి...రష్యన్ తల్లీ కూతుళ్లకు సోనూ సూద్ అండ
ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భారత్ కు వచ్చి కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఇరుక్కుపోయారు రష్యాకు చెందిన తల్లీకూతుళ్లు. వారికి సాయం చేసేందుకు సినీనటుడు సోనూ సూద్ ముందుకొచ్చాడు.
తిరుపతి: ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భారత్ కు వచ్చి కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఇరుక్కుపోయారు రష్యాకు చెందిన తల్లీకూతుళ్లు. ఈ రష్యన్ తల్లీకూతుళ్లు ఒలివియా(55), ఎస్తర్(32)లకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణభారతి ట్రస్టు ఛైర్మన్ దీపా వెంకట్ అండగా నిలిచారు. తల్లీకూతుళ్లతో ఆమె స్వయంగా మాట్లాడారు. రష్యన్-తెలుగు, రష్యన్-హిందీ మాట్లాడే దుబాసీలను వారి వద్దకు పంపారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బృందావనంలో చిక్కుకున్న తల్లిని తిరుపతికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేసినట్లు దీపా వెంకట్ తెలిపారు.
ప్రస్తుతం తిరుమలలో వున్న రష్యా యువతి ఎస్తర్ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి... తన ప్రతినిధులను ఎస్తర్ వద్దకు పంపించారు. ఆమె కోరిక మేరకు ఇవాళ శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. క్లిష్ట సమయంలో తిరుమలలో చిక్కుకున్న విదేశీ యువతికి అన్ని విధాలా ఆదుకుంటామని వైవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.
read more ఆ అపార్ట్ మెంట్ లో...పట్టుబడ్డ వారితో నాకు సంబంధాలా?: వైసిపి మహిళా ఎమ్మెల్యే కంటతడి
తిరుపతిలో ఆమె వసతి, ఆహారం ఇతర అవసరాలు కోరితే ఏర్పాటు చేస్తామని అన్నారు. తన తల్లి తిరుపతికి వచ్చాక ఇద్దరికీ మరోసారి స్వామి వారి దర్శనం కల్పించాలని ఎస్తర్ కోరడంతో తప్పకుండా ఏర్పాటు చేస్తామని చైర్మన్ అన్నారు.
ఇక సినీ నటుడు సోనూ సూద్ కూడా రష్యన్ తల్లీకూతుళ్లు ఇండియాలో చిక్కుకుపోవడంపై స్పందించారు. తనవంతుగా ఎలాంటి సాయమైనా చేస్తామంటూ వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం తిరుపతికి చెందిన ఓ న్యాయవాది కుటుంబం ఎస్తర్ను ఆదరించి వారింట్లోనే బస, భోజన వసతి కల్పించింది.