రూ. 5.25 కోట్ల పట్టివేత: కారుకు ఏపీ ఎమ్మెల్యే రాంబాబు స్టిక్కర్
రూ.5.25 కోట్ల నగదు పట్టుబడిన కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఏపీ ఎమ్మెల్యే అన్నం రాంబాబుదని వార్తలు వస్తున్నాయి. కారులో పట్టుబడిన నగదుపై చెన్నైలోని ఐటి అధికారులు విచారణ జరుపుతున్నారు.
చెన్నై: తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారులో తలిస్తున్న రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కారుకు ఉన్న స్టిక్కర్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిదని తొలుత భావించారు. కానీ ఆ స్టిక్కర్ ఆంధ్రప్రదేశ్ అన్నం రాంబాబుదని వార్తలు వస్తున్నాయి.
కారులో పట్టుబడిన నగదుపై చెన్నైలోని ఐటీ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. నగదు పట్టుబడిన కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినవారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి రవాణా చేస్తున్నారని ఆరంబాక్కం పోలీసులకు సమాచారం అందింది.
దాంతో బుధవారం తెల్లవారు డామున ఎలాపూరులోని చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో భాగంగా ఎమ్మెల్యే స్కిక్కర్ ఉన్న కారును ఆపీ సోదా చేశారు. దాంతో వారికి కారు వెనక సీటులో నాలుగు సంచుల్లో రూ.5.27 కోట్ల రూపాయలు వారికి చిక్కాయి.
ఒంగోలుకు చెందిన నాగరాజ్, వసంత్, కారు డ్రైవర్ సత్యనారాయణలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఇద్దరు పరారైనట్లు భావిస్తున్నారు. నగదును ఆదాయం పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. కారు మాత్రం కోయంబత్తూరుకు చెందిన సెంట్రల్ ఆర్టీవో పరిధిలోని వి. రామచంద్రన్ పేరు మీద ఉన్నట్లు తేలింది.
నగదు పట్టుకున్న కారుపై ఊహాగానాలు చెలరేగి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రాత్రి చెన్నై వెళ్తున్న ఓ కారును పోలీసులు పట్టుకున్నట్లు తనకు ఉదయం తనకు తెలిసిందని, దాని మీద తన పేరిట స్టిక్కర్ ఉన్నట్లు మీడియాలో వస్తోందని, అది ఫొటో జీరాక్స్ కాపీ అని బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఆ కారులో ఉన్న వ్యక్తులు ఒంగోలుకు చెందినవారు కావడంతో తనకు ఆపాదిస్తున్నారని ఆయన అన్నారు.
అది తనకు సంబంధించింది కాదని, వాహనంలో రూ.5 కోట్లు ఉన్నాయని చెబుతున్నారని, అది తమిళనాడు రిజిస్ట్రేషన్ వాహనమని ఆయన చెప్పారు .దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. ఎవరిది తప్పయితే వారిని శిక్షించాలని ఆయన అన్నారు.