చివరకు రోజాకు జగన్ ఆఫర్ చేసిన పదవి ఇదీ...
చిట్టచివరకు నగరి శాసనసభ్యురాలు రోజాకు కీలకమైన పదవి ఖాయమైంది. ఆమెను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి) చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. రోజాకు ఆ పదవిని ఖరారు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: చిట్టచివరకు నగరి శాసనసభ్యురాలు రోజాకు కీలకమైన పదవి ఖాయమైంది. ఆమెను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి) చైర్ పర్సన్ గా నియమించాలనే నిర్ణయం జరిగింది. రోజాకు ఆ పదవిని ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి ఎపిఐఐసి చైర్మన్ పదవి ఇచ్చినందుకు రోజా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు.
రోజా మంత్రి పదవి ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి లభించకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆమె మంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు. అయితే, ఆ తర్వాత జగన్ ఆమెను తాడేపల్లికి పిలిపించారు. ఆమెతో మంగళవారం తొలుత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మాట్లాడారు.
తనకు ఏ పదవీ అక్కర్లేదని ఆమె చెప్పారు కూడా. అయితే, చివరకు ఆమెను కీలకమైన ఏపిఐఐసి చైర్ పర్సన్ గా నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఆమెను నియమించే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఆర్టీసి చైర్ పర్సన్ పదవిని కూడా ఆమెకు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి.