శ్రీకాకుళం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డాక్టర్ తో సహా అతని కొడుకు మృతి చెందారు.

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని నందిగామ మండలం పెద్ద నాయుడుపేట వద్ద సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పలాసకు వస్తున్న వైద్యాధికారి కారు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఉన్న వంతెన రక్షణ గోడను వీరి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న పలాస ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మడే రమేష్ (45)తో పాటు అతడి కుమారుడు సంకల్ప్ (10) అక్కడికక్కడే మృతి చెందారు. వైద్యాధికారి భార్య లక్ష్మి (45), కుమార్తె సైర్య (14)కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళానికి తరలించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, కర్ణాటకలోని బీదర్‌లోని ఓ గ్రామంలో నవంబర్ 5నాటి అర్థరాత్రి ట్రక్కు, ఆటో రిక్షా ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. గాయపడిన 11 మందిలో రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మహిళలు అందరూ కూలీ పనులు చేసుకునేవారే. పని ముగించుకుని ఆటో రిక్షాలో ఇంటికి తిరిగి వస్తుండగా బీదర్‌లోని బేమలఖేడా ప్రభుత్వ పాఠశాల సమీపంలో ట్రక్కు ఢీకొట్టింది.

బీజేపీపై తప్పుడు ప్రచారం.. సోము వీర్రాజును మోడీ ఏం అడిగారంటే : జీవీఎల్ క్లారిటీ

చనిపోయిన మహిళలను పార్వతి (40), ప్రభావతి (36), గుండమ్మ (60), యాదమ్మ (40), జగ్గమ్మ (34), ఈశ్వరమ్మ (55), రుక్మిణి బాయి (60)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.