గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు యువకులు మృతి
ప్రకాశం జిల్లా అర్ధవీడు నుంచి గుంటూరు వెళుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని మితిమీరినవేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
గుంటూరు: గురువారం తెల్లవారుజామున గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా అర్ధవీడు నుంచి గుంటూరు వెళుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని మితిమీరినవేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా అర్ధవీడుకు చెందిన కొందరు ఇవాళ తెల్లవారుజామున టాటా మ్యాజిక్ వాహనం గుంటూరుకు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం వినుకొండ మండలం శివపురం శివారుకుచేరుకోగానే టైరు పంక్చర్ అయ్యింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టైర్ చేంజ్ చేస్తుండగా లారీ రూపంలో మృత్యువు రూపంలో వారిపైకి దూసుకువచ్చింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో రోడ్డుపక్కన నిలిపిన వాహనాన్ని గుర్తించలేకపోయాడు. దీంతో లారీ వాహనంపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు.
ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతుల వివరాలు
1. పరిమళ్ళ రమేష్( 23) డ్రైవర్,
2.తంగిళ్ళ పిరా( 30)డ్రైవర్
3.పానుగంటి కొనయ్య( 45)