బ్రేకింగ్ న్యూస్ : టిడిపి ఎంఎల్ఏపై తిరుగుబాటు
అనంతపురం టిడిపిలో ముసలం పుట్టింది. ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి వైఖరికి నిరసనగా పలువురు కీలక నేతలు గురువారం సమావేశమయ్యారు. మాజీ ఎంపి సైపుల్లా ఆధ్వర్యంలో పలువురు నేతలు అత్యవసర సమావేశం జరిపారు. ఎంఎల్ఏ నిరకుంశవైఖరికి నిరసనగా వీరంతా హాజరైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంఎల్ఏ తన పద్దతి మార్చుకోకపోతే తామంతా తమ దారి తాము చూసుకుంటామంటూ అల్టిమేటమ్ జారీ చేశారు.
అసలే, ఎంఎల్ఏకి టైం బావోలేదు. వైసిపి నేత గుర్నాధరెడ్డిని టిడిపిలోకి చేర్చుకున్నప్పటి నుండి ప్రభాకర్ చౌధరి ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చౌదరికి టిక్కెట్టు దక్కే విషయంలో కూడా అనుమానమే. ఎందుకంటే, ఎంపి జెసి దివాకర్ రెడ్డి పట్టుబట్టి మరీ గుర్నాధరెడ్డిని టిడిపిలోకి లాక్కువచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇప్పించే హామీతోనే రెడ్డిని జెసి టిడిపిలోకి తీసుకొచ్చారు.
అప్పటి నుండి చౌదరి పార్టీలో సమస్యలు మొదలయ్యాయి. దానికితోడు తాజాగా పార్టీ నేతలు కూడా చౌదరిపై తిరుగుబాటు లేవదీయటంతో పార్టీలోని సమస్యలు రోడ్డున పడ్డట్లైంది. అంటే చౌదరికి బలమైన రెడ్లే కాకుండా ఇటు ముస్లింలతో పాటు బిసి నేతలు కూడా వ్యతిరేకమవుతున్నారు. మరి, పార్టీలో మొదలైన ముసలం ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.