రమేష్ కుమార్ ఉద్వాసనను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పిస్తూ జారీ చేసిన జీవోను యోగేశ్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. ఆ జీవో చట్టబద్దతను ఆయన ప్రశ్నించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజానాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. యోగేశ్ అనే వ్క్తి ఆ పిల్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారంనాడు విచారణకు రానుంది. రమేష్ కుమార్ ను తొలగిస్తూ జారీ చేసిన జీవో చట్టబద్దతను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి కనగరాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పిస్తూ ఆయనను కొత్త ఎస్ఈసీగా ప్రభుత్వం నియమించింది. కనగరాజ్ పదవీబాధ్యతలు కూడా చేపట్టారు.
కనగరాజ్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. 9 ఏళ్లు పాటు ఆయన న్యాయమూర్తిగా పనిచేశారు. విద్య, మహిళలు, వృద్ధుల సంక్షేమాలకుసంబంధించిన కేసుల్లో ఆయన కీలకమైన తీర్పులు వెలువరించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కనగరాజ్ పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్ మేరకు రమేష్ కుమార్ తన పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఆయన స్థానంలో కనగరాజ్ ను నియమించారు.
రమేష్ కుమార్ కు ఉద్వాసన పలకడంపై ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ కు లేఖ కూడా రాశారు. అయినప్పటికీ జగన్ వెనక్కి తగ్గలేదు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రామసుందర రెడ్డిని నియమించినట్లు శుక్రవారం రాత్రి వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అవి పుకార్లు మాత్రమేనని తేలింది.