ఆంధ్ర ప్రదేశ్ లో ఆల్ టైమ్ రికార్డ్ పోలింగ్ ... ఫైనల్ గా ఎంత శాతమో తెలుసా..?
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఓటర్ చైతన్యం స్పష్టంగా కనిపించింది. ఓటు వేసేందుకు తెెలుగు ప్రజలు ఆసక్తి చూపించడంతో గత రికార్డులను బద్దలుగగొట్టేలా ఈసారి పోలింగ్ శాతం నమోదయ్యింది. ఎంతో తెలుసా..?
![Record Polling Percentage in Andhra Pradesh Assembly Elections 2024 AKP Record Polling Percentage in Andhra Pradesh Assembly Elections 2024 AKP](https://static-ai.asianetnews.com/images/01d2m4q6180j932wpsbqkvg6a7/Narendra-Modi--Budget-2019--voter_363x203xt.jpg)
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటుహక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు... దీంతో పోలింగ్ శాతం గణనీయంగా నమోదయ్యింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యిందని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తమ అంచనా ప్రకారం మొత్తం 81 శాతం పోలింగ్ నమోదయి వుంటుందన్నారు. అయితే ఇవాళ సాయంత్రం వరకు పూర్తిస్థాయి సమాచారం అందుతుందని... అప్పుడు పక్కాగా పోలింగ్ శాతం ఎంతో తెలుస్తుందని ఎన్నికల అధికారి వెల్లడించారు.
సోమవారం ఉదయం నుండే ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో చాలా పోలింగ్ బూతుల వద్ద భారీ క్యూలైన్ లు దర్శనమిచ్చాయి. ఓటర్లు కూడా ఓపిక ప్రదర్శిస్తూ గంటల తరబడి క్యూలో నిలబడి మరీ ఓటేసారు. సాయంత్రం పోలింగ్ సమయం ముగిసినా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు దీరారు. ఇలాంటి కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి 2 గంటలవరకు పోలింగ్ జరిగింది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ రికార్డును ఈ ఎన్నికలు బద్దలుగొట్టనున్నాయి. ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ అంచనా. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2 శాతంవున్నాయి. వీటిని కలిపితే గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా 79.8 శాతం పోలింగ్ నమోదయినట్లు. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి 12 తర్వాత కూడా పోలింగ్ జరిగింది. కాబట్టి తుది పోలింగ్ 81 శాతం వుండవచ్చని ఎన్నికల కమీషన్ అంచనా వేస్తోంది.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మూడో ఎన్నిక ఇది. అయితే ఎన్నిక ఎన్నికకూ ఓటర్లలో చైతన్యం మరింత పెరుగుతోంది. దీంతో ప్రతిసారీ పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో 78.41, రెండోసారి 2019లో 79.64 శాతం పమోదయితే ఈసారి 2024 లో పోలింగ్ 80 శాతాన్ని దాటిపోయేలా వుంది.
జిల్లాలవారిగా పోలింగ్ శాతం (12 గంటల వరకు) :
అల్లూరి సీతారామరాజు - 63.19 శాతం
అనకాపల్లి - 81.63 శాతం
అనంతపురం - 79.25 శాతం
అన్నమయ్య - 76.12 శాతం
బాపట్ల - 82.33 శాతం
చిత్తూరు - 82.65 శాతం
అంబేద్కర్ కోనసీమ - 83.19 శాతం
తూర్పు గోదావరి - 79.31 శాతం
ఏలూరు - 83.04 శాతం
గుంటూరు - 75.74 శాతం
కాకినాడ - 76.37 శాతం
కృష్ణా - 82.20 శాతం
కర్నూలు - 75.83 శాతం
నంద్యాల - 80.92 శాతం
ఎన్టీఆర్ - 78.76 శాతం
పల్నాడు -78.70 శాతం
పార్వతీపురం మన్యం - 75.24 శాతం
ప్రకాశం - 82.40 శాతం
పొట్టిశ్రీరాములు నెల్లూరు - 78.10 శాతం
శ్రీ సత్యసాయి - 82.77 శాతం
శ్రీకాకుళం - 75.41 శాతం
తిరుపతి - 76.83 శాతం
విశాఖపట్నం - 65.50 శాతం
పశ్చిమ గోదావరి -81.12 శాతం
వైఎస్సార్ - 78.12 శాతం
తుది పోలింగ్ శాతం వెల్లడి తర్వాత జిల్లాల పోలింగ్ శాతంలో కొంత మార్పు వుండవచ్చు.
పెరిగిన పోలింగ్ శాతంపై ఎవరి అంచనాలేమిటి..?
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో మూడుసార్లు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ మూడింటితో పోలిస్తే ఈసారే అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యింది. ఈ పెరిగిన పోలింగ్ తమకే అనుకూలమని అటు అధికార వైసిపి, ఇటు ప్రతిపక్ష టిడిపి కూటమి చెబుతోంది. వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ఓటర్లు అధికసంఖ్యలో పోలింగ్ బూత్ లకు చేరుకున్నారని టిడిపి జనసేన బిజెపి కూటమి అంటోంది. కానీ వైసిపి మాత్రం జగన్ సర్కార్ సంక్షేమ పథకాలే పోలింగ్ శాతం పెరగడానికి కారణమని... మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తమకు ఓటేసారని చెబుతున్నారు. ఇలా పెరిగిన పోలింగ్ శాతం తమకంటే తమకే అనుకూలమని ఎవరి ధీమాలో వారు వున్నారు.