ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడొద్దని గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్యశ్రీ సోదరి చెప్పారు. మ కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచారని ఆమె తెలిపారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాడు బయటకు రాడని... ఖచ్చితంగా శిక్ష పడుతుందని అధికారులు భరోసాను ఇచ్చారని ఆమె చెప్పారు
గుంటూరులో (guntur) ప్రమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రమ్య కేసులో (ramyasri) నిందితుడు శశికృష్ణకు (sasi krishna) న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రమ్య సోదరి కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచారని ఆమె తెలిపారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాడు బయటకు రాడని... ఖచ్చితంగా శిక్ష పడుతుందని అధికారులు భరోసాను ఇచ్చారని ఆమె చెప్పారు. ఈ పరిస్ధితుల్లో భయపడుతున్న సమయంలో పోలీసులు సెక్యూరిటీ కూడా కల్పించారని రమ్య సోదరి వెల్లడించారు. ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడొద్దని ఈ సందర్భంగా ఆమె ఆడపిల్లలకు సూచించారు. హోంమంత్రి, ఎమ్మెల్యేలు మీకు అండగా వుంటారని సీఎం జగన్ ధైర్యం చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు.
అంతకుముందు రమ్య తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇంత త్వరగా తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని అనుకోలేదన్నారు . న్యాయం జరిగిందని భావిస్తున్నామని.. ప్రేమోన్మాదులకు ఇలాంటి శిక్షపడాలని చెప్పారు. ప్రభుత్వం, పోలీసులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇంత త్వరగా న్యాయం జరుగుతుందని అనుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఉరిశిక్ష అమలైన రోజు మరింత సంతోషిస్తామన్నారు రమ్యను పిలిచి అత్యంత దారుణంగా హత్య చేశాడని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం తమను ఆదుకొందని వారు చెప్పారు. తన బిడ్డ ఆత్మ శాంతించిందని రమ్య తల్లి తెలిపారు.
అంతకుముందు బీటెక్ స్టూడెంట్ రమ్యశ్రీ హత్య కేసుపై అప్పట్లోనే సీఎం జగన్ స్పందించారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. అప్పటి రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 లక్షలు ఇచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 9న సీఎం జగన్ వద్దకు రమ్యశ్రీ కుటుంబ సభ్యులను అప్పటి హోం మంత్రి సుచరిత తీసుకెళ్లారు. ఘటన జరిగిన తీరును సీఎం జగన్ తెలుసుకొన్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. రమ్యశ్రీ కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చారు. అంతేకాదు రమ్య సోదరికి ఉద్యోగం ఇచ్చారు. ఐదు ఎకరాల పొలం కూడా ప్రభుత్వం ఇచ్చింది.
