రమణదీక్షితులుకు మరో షాక్: అదీ ఊడింది
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగమ సలహా మండలి నుంచి శ్రీవెంకటేశ్వరస్వామి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకు ఉద్వాసన పలికారు.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగమ సలహా మండలి నుంచి శ్రీవెంకటేశ్వరస్వామి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకు ఉద్వాసన పలికారు. ఈ మేరకు దేవస్థాన ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది.
ఆ స్థానంలో నూతన ప్రధాన అర్చకుడుగా ఇటీవల నియమితుడైన వేణుగోపాల దీక్షితులును నియమించింది. తిరుమలలో మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఆ సమావేశం వివరాలను టీటీడీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్ మీడియా ప్రతినిధులకు వివరించారు.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో 12 మంది అర్చకులను నియమిస్తామని చెప్పారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి గర్భాలయ గోపురానికి రూ.32 కోట్లతో స్వర్ణతాపడం చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దివ్యదర్శనం పథకానికి టీటీడీ 50శాతం వాటా కింద రూ.1.25 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సుధాకర్ యాదవ్ చెప్పారు.