మహా సంప్రోక్షణ.. నా అనుమానాలకు మరింత బలం: రమణ దీక్షితులు
తిరుమల శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం తదితర పరిణామాలపై స్పందించారు తిరుమల ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం వివాదానికి కారణమైంది.. తొమ్మిది రోజుల పాటు భక్తులను భగవంతుడికి దూరం చేయడం ఏంటని కొందరు..? అన్ని రోజుల పాటు దర్శనం నిలిపివేత వెనుక కుట్ర దాగుందని స్వరూపానందేంద్ర సరస్వతి వంటి వారు వ్యాఖ్యానించడం.. వివాదం తీవ్రమవుతుండటంతో సీఎం స్పందించి పరిమితంగా భక్తులకు దర్శన సదుపాయాన్ని కల్పించాలని ఆదేశాలివ్వడం చకచక జరిగిపోయింది.. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్పందించారు.
భక్తుల నుంచి అగ్రహజ్వాలలు ఎదురయ్యే సరికి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని ఆరోపించారు.. మహా సంప్రోక్షణపై ఛైర్మన్కు అవగాహన లేదని.. భక్తులను దర్శనానికి అనుమతించకూడదనే నిర్ణయం సరైనది కాదని. ఇది భక్తులకు భగవంతుడిని దూరం చేయాలనే ప్రయత్నమేనని తప్పుబట్టారు..
ఈ నిర్ణయాలన్నీ గతంలో తాను టీటీడీపై చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆలయంలో రహస్యంగా సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. స్వామి వారికి ఎలాంటి అపచారం చేయకుండా సంప్రోక్షణ నిర్వహించాలని టీటీడీని కోరారు...