అధికార టిడిపిని ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహంతోనే వైసీపీ ఇటు న్యాయపోరాటంతో పాటు అటు రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున చర్చను లేవదీస్తోంది.

శాసనసభ్యుల, ఎంపిల అనర్హతకు సంబంధించిన ప్రైవేటు మెంబర్ బిల్లు రాజ్యసభలో చర్చకు రానున్నది. వైసీపీ రాజ్యసభ ఎంపి వి. విజయసాయిరెడ్డి ఈ మేరకు బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. శాసనసభ్యుల అనర్హతకు సంబంధించిన ఆర్టికల్ 102, 191కి సవరణలు ప్రతిపాదిస్తూ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. ప్రైవేటు మెంబర్ బిల్లు చర్చ నిమ్మితం అడ్మిట్ అయినట్లు డిప్యూటి ఛైర్మన్ కురియన్ రెడ్డికి వర్తమానం పంపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలైన తెలుగుదేశం, తెలంగాణా రాష్ట్ర సమితి ప్రతిపక్షాల్లోని శాసనసభ్యులను, ఎంపిలను బలవంతంగా తమ పార్టీల్లోకి లాక్కుంటున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన శాసనసభ్యులు, ఎంపిలు కూడా ఇష్టం వుండో లేక తప్పనిసరి పరిస్ధితుల్లోనో అధికార పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు. ఏపిలో వైసీపీ నుండి ఇప్పటి వరకూ 22 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించారు.

ఫిరాయించిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయమని స్పీకర్ ను ఎన్ని సార్లు కోరినా ఉపయోగం కనబడలేదు. ఇదే విషయమై న్యాయస్ధానాలకు కూడా వైసీపీ వెళ్లింది. ప్రస్తుతం ఇదే అంశం సుప్రింకోర్టులో విచారణ దశలొ ఉంది. అన్నీ వైపుల నుండి అధికార టిడిపిని ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహంతోనే వైసీపీ ఇటు న్యాయపోరాటంతో పాటు అటు రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున చర్చను లేవదీస్తోంది. అయితే, ఈ బిల్లుపై చర్చ ఎప్పుడు జరిగేదీ తెలీదు.