ఎంపీ ఫోన్ పోతే ఇంత ఓవరాక్షనా .. నా బెడ్రూంలోకి వచ్చేస్తారా : పోలీసులపై మహిళ ఆగ్రహం, జగన్ దృష్టికి వ్యవహారం
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫోన్ చోరీకి గురికావడంతో రాజమండ్రి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఓ మహిళ ఇంట్లో సోదాలు చేసిన వ్యవహారంపై ఏపీ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ (ysrcp ) యువ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ (margani bharat) ఫోన్ చోరీకి గురైన వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. రాజమహేంద్రవరం ఎయిర్పోర్టులో (rajahmundry airport0 ఆయన ఫోన్ మిస్సైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాశ్రయంలో ఒక మహిళా పారిశ్రామికవేత్తతో సెల్ఫీ దిగిన తర్వాత నుంచి ఫోన్ కనిపించడం లేదని భరత్ ఫిర్యాదులో తెలిపారు. దీనిపై సీరియస్ గా స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఎంపీ అనుమానం వ్యక్తం చేసిన ఓ మహిళ ఇంటికి వెళ్లి, సోదాలు నిర్వహించారు. దీనిపై ఆ మహిళ స్పందిస్తూ.. పోలీసులు తన ఇంట్లోకి వచ్చి దురుసుగా మాట్లాడారని మీడియాకు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. మహిళల రక్షణ కోసం దిశా చట్టం తీసుకొచ్చారని.. అలాంటిది పోలీసులే తనకు సమస్యలు తీసుకొచ్చారని మండిపడ్డారు. తాను దిశకు ఫోన్ చేయాలా... ఎవరికి విషయం చెప్పాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాను సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఎంపీ ఫోన్ పోతే పోలీసులు ఇంత ఓవరాక్షన్ చేయాలా.. ఇటీవల రాజమండ్రి బ్రిడ్జి దగ్గర ఓ మృతదేహం దొరికితే దానిపై ఎలాంటి రియాక్షన్ లేదని మండిపడ్డారు. కానీ ఎంపీ ఫోన్ పోతే నేరుగా తన బెడ్రూంలోకి వచ్చేసి .. వస్తువులన్ని విసిరి పడేశారని ఆమె ఆరోపించారు.