క్రికెట్ చూడటంవల్లే విజయనగరం ట్రైన్ యాక్సిడెంట్..: రైల్వే మంత్రి సంచలనం
గతేడాది విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న రైల్వే ప్రమాదానికి క్రికెట్ మ్యాచ్ కూడా ఓ కారణమని రైల్వే మంత్రి తెలిపారు. అసలు క్రికెట్ మ్యాచ్ ప్రమాదాానికి ఎలా కారణమయ్యిందో ఆయన వివరించారు.
న్యూడిల్లీ : గతేడాది ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం 14 మంది ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం నుండి పలాసకు ప్రయాణికులతో వెళుతున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగివున్న విశాఖ-రాయగడ్ రైలును విశాఖ-పలాస రైలు ఢీకొట్టింది. ఈ భయానక రైలుప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోగా మరెందరో క్షతగాత్రులయ్యారు. తాజాగా ఈ రైలు ప్రమాదానికి గల కారణాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బయటపెట్టారు.
అక్టోబర్29, 2023 లో కంటకపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదానికి లోక్ పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ నిర్లక్ష్యమే కారణమని రైల్వే మంత్రి తెలిపారు. సెల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ లోకో పైలట్లు రైలు నడిపారని... అందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తమ విచారణలో తేలినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఇద్దరు పైలట్ల నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకుందని రైల్వే మంత్రి వెల్లడించారు.
రైల్వే శాఖ ఇటీవల చేపట్టిన భద్రతా చర్యలగురించి మాట్లాడుతూ మంత్రి అశ్విని వైష్ణవ్ విజయనగరం రైలు ప్రమాదం గురించి ప్రస్తావించారు. వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖ వాటి నివారణకు చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే లోకో పైలట్ల తీరును పర్యవేక్షించే వ్యవస్థను తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.