కుటుంబ సభ్యులతో జగన్ను కలిసిన పీవీ సింధు, రజని
కామన్వెల్త్ గేమ్స్లో సత్తా చాటిన తెలుగు క్రీడాకారిణీలు షట్లర్ పీవీ సింధు, భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలు ఈ.రజనీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరిని సీఎం అభినందించారు.
ఇటీవల బ్రిటన్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో సత్తా చాటిన తెలుగు క్రీడాకారిణీలు షట్లర్ పీవీ సింధు, భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలు ఈ.రజనీలు గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా తాను గెలిచిన బంగారు పతకాన్ని సీఎంకు చూపించారు పీవీ సింధు.
అలాగే కామన్వెల్త్ గేమ్స్ మహిళల హాకీలో గోల్కీపర్గా వ్యవహరించిన ఇ.రజని.. కాంస్య పతకం సాధించిన ఉమెన్స్ హాకీ టీమ్ ఆటోగ్రాఫ్లతో కూడిన హాకీ స్టిక్, టీమ్ టీ షర్ట్ను సీఎంకు బహుకరించారు రజనీ. అనంతరం రజనికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, సింధు, రజని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శన తర్వాత తిరిగి భారత్కు చేరుకున్న పీవీ సింధు, రజీనీలు ఇటీవల ఏపీ మంత్రి ఆర్కే రోజా ఇంట్లో భోజనానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
కాగా.. కామన్వెల్త్ గేమ్స్ 2022 వుమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో కెనడా బ్యాడ్మింటన్ ప్లేయర్ మిచెల్ లీపై 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం అందుకుంది పీవీ సింధు. ఇంతకుముందు 2014 కామన్వెల్త్ గేమ్స్లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఓడి రజతం సాధించిన పీవీ సింధు, ఈసారి ఏకంగా స్వర్ణం సాధించి... ‘ఇండియన్ గోల్డెన్ గర్ల్’గా కీర్తి ఘడించింది...