వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పూర్తిగా అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. పులివెందుల మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ కూడా.. హత్య జరిగిన రోజు మొదట వివేకా ఇంటికి వచ్చింది అవినాష్ రెడ్డినే అని వాంగ్మూలం ఇచ్చింది.  

అమరావతి : మాజీ మంత్రి YS Vivekananda reddy హత్యకు గురైన రోజు (2019 మార్చి 15) ఉదయాన్నే తొలుత కడప ఎంపీ వైఎస్ Avinash Reddy వివేక ఇంటికి వచ్చారని పులివెందుల మాజీ ఎంపీటీసీ సభ్యురాలు K. Sasikala సిబిఐ అధికారులతో చెప్పారు.  వివేకా ఇంట్లోకి వెళ్లిన అవినాష్రెడ్డి 3,4 నిమిషాల తర్వాత బయటకు వచ్చి లాన్ లో ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు అని తెలిపారు. ఇంతలోనే డాక్టర్ మధు, మరికొందరు నర్సులు వచ్చారని తెలిపారు. కాసేపటికి వివేకా మృతిచెందారంటూవారు వెల్లడించారని శశికళ చెప్పారు.  ఆ తర్వాత వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైయస్ ప్రతాప్ రెడ్డి,  వైయస్ అభిషేక్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి వచ్చారని తెలిపారు,

ఆ సమయంలో తానూ వివేక ఇంటిలోపలికి వెళ్లానని.. బెడ్ రూమ్ లో రక్తం, బాత్రూంలో మృతదేహాన్ని చూసి ఇది హత్యేనని తనకు స్పష్టంగా అనిపించిందని వివరించారు. వివేక ఇంటికి ఆమె ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? అనే అంశాలపై సిబిఐ ఆమెను విచారించి.. 2020 సెప్టెంబర్ 20న వాంగ్మూలం తీసుకుంది.

తప్పుడు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఏఎస్పీ ఒత్తిడి చేశారు… మీడియాతో కల్లూరు గంగాధర్ రెడ్డి..
‘వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐకి నేను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు... అని ఆ కేసులో అనుమానితులుగా ఉన్న కల్లూరు గంగాధర్ రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సునీతను ఈ కేసు నుంచి బయటపడేయాలని జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ప్రలోభ పెట్టాడు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డిపై  తప్పుడు సాక్ష్యం చెబితే కేసు బలంగా ఉంటుంది అన్నాడు.  సిబిఐ  ఏఎస్పీ రామ్ సింగ్ వద్దకు వెళ్లగా.. ఆయన కూడా తప్పుడు సాక్ష్యం చెప్ాలని  ఒత్తిడి తెచ్చారు. హత్య చేసినట్లు ఒప్పుకుంటూ రూ.10 కోట్లు ఇస్తామని.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆఫర్ చేసినట్లు చెప్పాలని ఏఎస్పీ ఒత్తిడి తెచ్చారు. మేం చెప్పినట్లు చేస్తే జగదీశ్వర్ రెడ్డి నీకు డబ్బులు ఇప్పిస్తారని ప్రలోభ పెట్టారు’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 23న అప్పటి సీఐ శంకరయ్య మరో కొత్త విషయాన్ని తెలిపారు.  YS Vivekananda reddy హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తనపై ఎంతో ఒత్తిడి తెచ్చారని.. అయినా తాను లొంగలేదని అప్పటి పులివెందుల ci shankaraiah సిబిఐకి తెలిపారు. ys avinash reddyతోపాటు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా ఒత్తిడి చేశారన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న భయంతోనే తొలుత హత్యానేరం (ఐపిసి సెక్షన్ 302) కింద కేసు నమోదు చేయలేకపోయానని వివరించారు. కేసు లేకుండానే వివేక మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు వారు ప్రయత్నించారని చెప్పారు. 

అవినాష్ రెడ్డికి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి అత్యంత సన్నిహితుడని, ఎర్ర గంగిరెడ్డి వివేకా వద్ద పిఎస్ గా పని చేశారని సీబీఐ అధికారులకు వివరించారు. వివేకాను ఎవరు హత్య చేశారో వారికి తెలుసు అన్నారు. వీరందరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించిందని తెలిపారు. ఈ మేరకు 2020 జూలై 28 న, గతేడాది సెప్టెంబర్ 28న ఆయన సీబీఐ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వాటిలోని మరికొన్ని అంశాలు తాజాగా వెలుగు చూశాయి.