అమిత్ షా వాహనంపై రాళ్ల దాడి.. టీడీపీ, బీజేపీ మాటల యుద్ధం
బీజేపీ, టీడీపీల మాటల యుద్ధం.. ఏపీలో పొలిటికల్ హీట్
ఏపీలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. మొన్నటి వరకు మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, టీడీపీ ఇప్పుడు మాటల యుద్ధానికి దిగాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వాహనాన్ని అడ్డుకున్నందుకు గానూ.. ఈ మాటల యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం అమిత్ షా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచ తిరిగి వస్తున్న ఆయనను అలిపిరి వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అమిత్ షా వాహనాన్ని అడ్డుకోవడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు.
ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప దాడి కూడా నెలకొంది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో.. అమిత్ షా కాన్వాయిలోని ఓ వాహనానికి రాయి తగిలి అద్ధం పగిలాయి. కాగా.. ఈ దాడి చంద్రబాబే స్వయంగా చేయించారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడికే రక్షణ లేదా అంటూ సోమువీర్రాజు ప్రశ్నించారు.
కాగా.. దీనిపై హోం మంత్రి చినరాజప్ప, మంత్రి సోమిరెడ్డి స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని నిరసన తెలిపినట్లు వార్తలు వస్తున్నాయని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. అలిపిరి ఘటనపై విచారణ జరుపుతామని చెప్పారు. ఏది ఏమైనా హోదా కోసం ఏపీలో ప్రశాంతమైన ఉద్యమం జరుగుతుందని ఆయన అన్నారు.
ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు అనేక శక్తులు పనిచేస్తున్నాయన్నారు. అందరూ సయంమనం పాటించాలని చినరాజప్ప విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కల్పించిన కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. షా ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్ల దాడి జరగలేదని ఆయన చెప్పారు. ఆ పక్క వాహనానికి మాత్రమే రాయి తగిలినట్లు ఆయన చెప్పారు. ఏది ఏమైనా దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మరోసారి స్పష్టం చేశారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నేతలే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారన్నారు.