మోడీ తిరుమల పర్యటన ఖరారు: జగన్ భేటీ లేనట్టే
ప్రధానమంత్రి మోడీ ఈ నెల 9వ తేదీన తిరుపతికి రానున్నారు. ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ తొలిసారిగా తిరుపతికి రానున్నారు.
అమరావతి: ప్రధానమంత్రి మోడీ ఈ నెల 9వ తేదీన తిరుపతికి రానున్నారు. ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ తొలిసారిగా తిరుపతికి రానున్నారు. మోడీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అవుతారని తొలుత ప్రచారం సాగింది. అయితే మోడీ అధికారిక టూరులో మాత్రం జగన్ భేటీకి సంబంధించిన షెడ్యూల్ మాత్రం లేదు.
ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి మోడీ శ్రీలంక నుండి తిరుపతికి చేరుకొంటారు. సాయంత్రం 4:40 గంటల నుండి 5:10 గంటల వరకు బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 5:10 గంటలకు తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు.
సాయంత్రం ఆరు గంటల నుండి 7:15 గంటల వరకు తిరుమలలో శ్రీవారిని దర్శించుకొంటారు. రాత్రి 8:15 గంటలకు మోడీ ఢిల్లీకి తిరుగు ప్రయాణమౌతారు. ఈ నెల 9వ తేదీన ప్రధానమంత్రి మోడీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారని గతంలో ప్రచారం సాగింది.
రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై జగన్ మోడీతో చర్చించే అవకాశాలున్నట్టుగా చెప్పారు. అయితే మోడీతో జగన్ భేటీకి సంబంధించి షెడ్యూల్లో మాత్రం లేదు. ఈ నెల 15వతేదీన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.