ప్రభుత్వం చర్చలకు పిలిచింది .. కానీ వెళ్లం: తేల్చిచెప్పిన పీఆర్సీ సాధన సమితి
ఉద్యమంలోకి ఎలాంటి రాజకీయపార్టీలను అనుమతించేది లేదన్నారు ఏపీ ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) . ప్రభుత్వం మేము యుద్ధం ప్రకటించినట్లు ఫీల్ అవుతుందని మండిపడ్డారు. జీవోలు ఇచ్చే ముందు కనీసం చర్చలు జరపలేదని.. ఉద్యోగుల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని బొప్పరాజు ఫైరయ్యారు.
ఉద్యమంలోకి ఎలాంటి రాజకీయపార్టీలను అనుమతించేది లేదన్నారు ఏపీ ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) . పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ (prc steering committee) సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మేము యుద్ధం ప్రకటించినట్లు ఫీల్ అవుతుందని మండిపడ్డారు. జీవోలు ఇచ్చే ముందు కనీసం చర్చలు జరపలేదని.. ఉద్యోగుల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని బొప్పరాజు ఫైరయ్యారు. ప్రభుత్వం వారి రాజకీయ పార్టీ తరపున మాటల యుద్ధం చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు.
ఉద్యోగులతో ప్రభుత్వం ఘర్షణ వాతావరణం కోరుకుంటుందని... పార్టీ పరంగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ప్రచారం చేస్తోందని వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని.... ఉద్యమాన్ని పక్కదారి పట్టించే వ్యాఖ్యలకు ప్రలోభ పడొద్దని బొప్పరాజు అన్నారు. వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా జిల్లా నాయకులు చర్యలు తీసుకోవాలని.. జిల్లాల్లో ఉద్యమ పరిస్థితిపై 8 మంది సభ్యులతో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
మరో ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ (suryanarayana) మాట్లాడుతూ.. కమిటీ ఏర్పాటుపై మీడియాలో చూడటం తప్ప అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదన్నారు. శశిభూషణ్ చర్చలకు రావాలని ఫోన్ చేశారని.. కమిటీ పరిధి, నిర్ణయాధికారం స్పష్టం కాలేదని సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలు నిలిపివేసేవరకూ ఎలాంటి చర్చలకు ముందుకు వెళ్ళేది లేదని... రాజకీయ వివాదాలకు తావు లేకుండా ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని వివరిస్తామని ఆయన చెప్పారు.
బండి శ్రీనివాసరావు (bandi srinivasarao) మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్ కు సమ్మె నోటీస్ ఇస్తామని వెల్లడించారు. రికవరీ వచ్చే పీఆర్సీ ని గతంలో ఎప్పుడూ చూడలేదని.. ప్రభుత్వం పాత జీతాలు ఇవ్వడానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని ఆయన దుయ్యబట్టారు. తాము కష్టపడిన దానికి మా జీతాలు ఇవ్వాలని కోరుతున్నామని.. స్టీరింగ్ కమిటీని 12 నుంచి 20 కి పెంచామని బండి శ్రీనివాసరావు వెల్లడించారు.
వెంకట్రామి రెడ్డి (venkatrami reddy) మాట్లాడుతూ.. జీవోలు వెనక్కి తీసుకుని అశుతోష్ మిశ్రా నివేదిక బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మెరుగైన పీఆర్సీ ఇచ్చేందుకు మళ్లీ చర్చలు జరపాలని.. కాంట్రాక్ట్, NMR ఉద్యోగుల సమస్యలు కూడా ప్రభుత్వం ముందు పెడతామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.